హైదరాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ): ‘మేడిపండు చూడ..’ చందంగా ఉంది ప్రస్తుతం బీజేపీ పరిస్థితి. పైకి శక్తిమంతంగా కనిపిస్తున్నప్పటికీ, కమలదళం లోపల కుతకుతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చతికిలబడటంతో పాలకపక్షం బీజేపీ మరింత బలపడిందన్న అభిప్రాయాలు గతంలో వ్యక్తమయ్యాయి. అయితే, వాస్తవానికి బీజేపీ పరిస్థితి కూడా పై స్థాయిలో అంత గొప్పగా ఏమీ లేదు. కమలదళం కూడా ప్రస్తుతం రోజు రోజుకు బలహీనపడుతున్నట్టు ఇటీవల ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల నాయకత్వంలో పార్టీ మరింత బలహీనపడుతున్న సంకేతాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇటీవల ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు నియామకం ద్వారా బయటపడ్డాయి. మోదీ, షాల వైఖరి పట్ల పార్టీలో సీనియర్లు రగిలిపోతున్నారు. ఈ ద్వయం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రం పనితీరు పట్ల కేంద్ర మంత్రి, పార్టీ మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. గతంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. అగ్రనేతలతో చర్చించేవారని, మెజార్టీ నేతల అభిప్రాయాలకు అనుగుణంగానే పార్టీ నిర్ణయాలు ఉండేవన్నారు. అయితే, పార్టీలో ఇప్పుడా పరిస్థితి కొరవడిందని పేర్కొన్నారు. మరో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యస్వామి కూడా తరుచూ పార్టీపై విమర్శనాస్ర్తాలు సంధించడం ఆ పార్టీలో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తికి అద్దం పడుతున్నాయి.
యోగి వ్యూహాత్మక మౌనం
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో తనకు స్థానం కల్పించకపోవడం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కూడా ఆగ్రహంతో ఉన్నట్టు ఆయనను నిశితంగా గమనిస్తున్న పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ కీలక భూమిక పోషించాల్సి ఉంది. కానీ అసంతృప్తితో ఉన్న యోగి ఆదిత్యనాథ్ 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏ మేరకు కృషి చేస్తారన్నది ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న చర్చ. పార్టీలో ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వర్గాల కథనం ప్రకారం.. ఢిల్లీకి, లక్నోకు మధ్య రోజురోజుకూ అంతరం పెరుగుతున్నదని చెబుతున్నారు. పార్టీలో నిర్ణయాధికారాలన్నీ ఢిల్లీ పెద్దలు (మోదీ, షా) చేతిలో పెట్టుకొని ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నట్టు ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్టీలో యోగిలాంటి ప్రజాదరణ కలిగిన నేతలు భవిష్యత్తులో ప్రధాని పదవికి పోటీ కాకూడదన్న వ్యూహంతోనే వారికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినాయకత్వ ఎత్తుగడలను గ్రహించిన యోగి.. వ్యూహత్మక మౌనం పాటిస్తున్నారని చెబుతున్నారు. పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా నియామకం అయిన వారికి కనీసం మర్యాదపూర్వకంగా అయినా యోగి శుభాకాంక్షలు తెలపకపోవడం ఆయన ఆగ్రహానికి నిదర్శనమని పేర్కొంటున్నారు.
టార్గెట్ యోగి?!
పార్టీ అధినాయకత్వం పట్ల యోగి అసంతృప్తిని గమనించిన పార్టీ పెద్దలు ఆయన్ను బలహీనపరచడం ద్వారా దారికి తెచ్చుకునే విధంగా పావులు కదుపుతున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదంటూ యూపీ జలవనరుల శాఖ మంత్రి దినేశ్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేయడం వెనుక పార్టీ పెద్దల ప్రమేయం ఉన్నట్టు యోగి వర్గం అనుమానిస్తున్నది. రాజీనామా బెదిరింపునకు దిగిన సదరు మంత్రి యోగి వైఖరిపై హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడంతో దీని వెనుక షానే ఉన్నారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే మరో మంత్రి బ్రజేష్ పాఠక్ కూడా సీఎం యోగిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఏదైనా విషయం ఉంటే ముందుగా సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా నేరుగా ఢిల్లీ పెద్దలకే ఫిర్యాదు చేయడం వెనుక మతలబు ఏమిటని పార్టీలో చర్చ జరుగుతున్నది.