లక్నో : యూపీలోని బీజేపీ సర్కార్ తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేపై కుల వివక్ష చూపించడం చర్చనీయాంశంగా మారింది. మలిహాబాద్ ఎమ్మెల్యే జై దేవీ కౌశల్ మాట్లాడుతూ.. శీత్లాదేవీ ఆలయంలో రూ.78 లక్షల విలువైన నిర్మాణ పనుల కోసం భూమిపూజ నిర్వహించారని తెలిపారు. ఆ పూజ కోసం తాను వెళ్తే కనీసం పూలు కూడా ముట్టుకోనివ్వలేదని, భూమిపూజలో పాల్గొనాలని కనీసం అడగలేదని ఆరోపించారు.
తాను పాసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో తనపై వివక్ష చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం తాను అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగి నిధులు కేటాయించేలా చేశానని.. కానీ తననే ఇలా అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు తీసుకోవాలని కోరారు.