సంబల్పూర్/భువనేశ్వర్, ఫిబ్రవరి 16: ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు జయనారాయణ్ మిశ్రా విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిణి పట్ట దురుసుగా ప్రవర్తించారు. ఆమెను దూషించడమే కాకుండా నెట్టివేశారు. ఒడిశాలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ బీజేపీ బుధవారం సంబల్పూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది. కార్యాలయంలోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తుండగా, అడ్డుకున్న తమపై ఎమ్మెల్యే మిశ్రా చిందులు తొక్కారని ధనుపల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ అనిత ప్రధాన్ తెలిపారు. తన ముఖంపై చేయి వేసి, తోసేశారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేపై వెంటనే చర్య తీసుకోవాలని ఒడిశా పోలీస్ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు డీఐజీని కలిసి విజ్ఞప్తి చేశారు.