కోల్కతా: బీజేపీకి అభ్యర్థుల కొరత ఉన్నదని, అందుకే ఎంపీలను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నదని పశ్చిమ బెంగాల్ నటి, టీఎంసీ నాయకురాలు సయంతిక బెనర్జీ విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ ప్రజలను అభ్యర్థులుగా బీజేపీ నిలబెట్టడం లేదని ఆమె ఆరోపించారు. ఎంపీలను లేదా సెలబ్రెటీలను అభ్యర్థులుగా పోటీకి దించుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మరోసారి గెలుస్తుందని, మమతా బెనర్జీ మళ్లీ సీఎం అవుతారని సయంతిక బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మూడో విడుత పోలింగ్ మంగళవారం జరుగనున్నది.