న్యూఢిల్లీ : ముంబై పోలీసు కమీషనర్.. మహారాష్ట్ర హోంమంత్రిపై చేసిన ఆరోపణలపై ఇవాళ లోక్సభ జీరో అవర్లో చర్చించారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ, స్వతంత్ర ఎంపీలు తీవ్ర స్థాయిలో .. సీఎం ఉద్దవ్పై విమర్శలు చేశారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి వంద కోట్లు వసూల్ చేయాలని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆదేశాలు జారీ చేసినట్లు ఓ లేఖలో మాజీ పోలీసు కమీషనర్ పరంబీర్ ఆరోపించారు. ఈ అంశాన్ని జీరో అవర్లో లేవనెత్తారు. మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ మనోజ్ కోటక్ డిమాండ్ చేశారు. మహా కూటమి ప్రజలను దోచేస్తోందన్నారు. ముంబైలోనే పరిస్థితి ఇలా ఉంటే, మరి రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన అడిగారు. ఈ కేసును సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ అయిన ఏఎస్ఐ సచిన్ వాజేను మళ్లీ ఎలా అపాయింట్ చేశారని బీజేపీ ఎంపీ రాకేశ్ సింగ్ అడిగారు. నిన్నటి వరకు ఎన్సీపీ నేతలు అది సీరియస్ ఇష్యూ అన్నారని, కానీ ఇవాళ ఉదయం నుంచి మాట మారుస్తున్నారని, అంటే హోంమంత్రి ఎక్కడ తమ చిట్టా విప్పుతారో అని భయపడుతున్నారని ఎంపీ రాకేశ్ ఆరోపించారు. ఎవరెవరికి ఎంత ముట్టాయో తేలాలన్నారు.
హోంమంత్రి బెదిరించడం వల్లే ఎన్సీపీ నేతలు వెనక్కి తగ్గినట్లు ఉన్నారని బీజేపీ ఎంపీ కపిల్ పాటిల్ ఆరోపించారు. మహా వికాశ్ అగాధీని నిర్వీర్యం చేసేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నట్లు శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ఆరోపించారు. ఇన్స్పెక్టర్ కు మద్దతుగా దేశంలో ఓ సీఎం మీడియా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని, వంద కోట్ల టార్గెట్ ఇచ్చిన ఆ ఇన్స్పెక్టర్కు సీఎం మద్దతు ఇవ్వడం దారుణమని బీజేపీ ఎంపీ రాకేశ్ సింగ్ అన్నారు. 16 ఏళ్ల సస్పెండ్ అయిన వ్యక్తిని ఏ ఆధారంగా మళ్లీ నియమించారని, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. ఉద్దవ్ థాకరేనే ఆ ఆఫీసర్ను నియమించాలని సీఎం ఫడ్నవీస్ను కోరారని, కానీ మాజీ సీఎం ఫడ్నవీస్ ఆ అభ్యర్థన తిరస్కరించారని, ఉద్దవ్ సీఎం కాగానే ఆ ఆఫీసర్ను నియమించినట్లు స్వంతంత్ర ఎంపీ నవనీత్ రవి రాణా విమర్శించారు.