ముంబై : బహిష్కృత బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మహారాష్ట్రలోని భీవండి పోలీసులు సమర్లు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరక వ్యాఖ్యలకు సంబంధించి సోమవారం వాంగ్మూలం నమోదు చేసేందుకు నోటీసులు జారీ చేసినట్లు ఆదివారం ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. అలాగే మరో బహిష్కృత బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్కు సైతం ఈ నెల 15న తన స్టేట్మెంట్ను రికార్డు చేయాలని నోటీసులు జారీ చేసినట్లు పోలీస్ అధికారి చేతన్ కకడే తెలిపారు. మే 30న రజా అకాడమీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నూపుర్ శర్మతో పాటు నవీన్ కుమార్ జిందాల్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలోని నుపూర్ శర్మకు థానే జిల్లా పోలీసులు సైతం ఈ నెల 22న తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే చర్చకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఇవ్వాలని పోలీసులు న్యూస్ చానెల్ను కోరారు. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెల 5న నూపుర్ శర్మతో పాటు ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్గా ఉన్న నవీన్ జిందాల్ను సైతం బహిష్కరించింది. దేశంతోపాటు గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి నేపథ్యంలో వారిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నూపుర్ శర్మ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పింది.