కోల్కతా: దుర్గా పూజ సమయంలో బెంగాలీలు మాంసాహారం తీసుకోవడాన్ని నిషేధించాలని బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి అలియాస్ బాగేశ్వర్ బాబా డిమాండ్ చేశారు. అయితే బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఈ అభ్యర్థనను తోసిపుచ్చారు. పండుగ సమయంలో బెంగాలీలు ఏమి తినాలనేది నిర్ణయించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. (Bageshwar Baba) గతంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పాలనలో పశ్చిమ బెంగాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి బాగేశ్వర్ బాబాకు అనుమతి నిరాకరించారు. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం హౌరాలో జరిగిన ఒక ప్రవచన కార్యక్రమంలో బాగేశ్వర్ బాబా మాట్లాడారు. నవరాత్రి సందర్భంగా దుర్గా పూజ నిర్వహించే సమయంలో బెంగాలీలు మాంసాహారం, మద్యం తీసుకోవడాన్ని నిషేధించాలని ఆయన కోరారు. దుర్గా పూజ సమయంలో మాంసాహారం తీసుకునేవారు అపవిత్రులని ఆయన అన్నారు.
కాగా, బాగేశ్వర్ బాబా వ్యాఖ్యలను బెంగాలీల ఆహారపు అలవాట్లు, వారి సాంస్కృతిక వారసత్వంపై దాడిగా చాలామంది అభివర్ణించారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కూడా దీనిపై స్పందించారు. ‘బాగేశ్వర్ బాబా మరో ప్రపంచం నుంచి వచ్చారు. బెంగాల్ ప్రజలు ఏమి తినాలి, ఏమి తినకూడదు అని నిర్ణయించే హక్కు ఆయనకు లేదు. బెంగాలీలు చేపలు, మాంసం తింటారు. బెంగాలీలు మాంసం, చేపలు తినడాన్ని వివేకానందుడు సమర్థించారు. బాగేశ్వర్ బాబా పట్ల మాకు ఎంతో గౌరవం ఉన్నది. కానీ ఆయన వ్యాఖ్యల గురించి బెంగాలీలు ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని అన్నారు.
మరోవైపు బెంగాల్లోని ప్రతిపక్ష పార్టీలు కూడా బాగేశ్వర్ బాబా వ్యాఖ్యలను ఖండించారు. ‘బయటి వ్యక్తులు వచ్చి అంతా సరిచేస్తామంటే, బెంగాల్ ప్రజల స్వేచ్ఛ ఏమవుతుంది? ప్రజల కోరిక మేరకు దుర్గా పూజ కమిటీలు పూజలు నిర్వహిస్తాయి. వారు నిబంధనలను పాటిస్తారు. ఇందులో బాగేశ్వర్ బాబా ప్రమేయం ఎందుకు?’ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ ప్రశ్నించారు. దుర్గా పూజ సమయంలో బెంగాలీలు ఏమి తినాలనేది ఏ బీజేపీ బాబా నిర్ణయించలేరని, అలా జరుగనివ్వబోమని బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి సుమన్ రాయ్ చౌదరి అన్నారు.