న్యూఢిల్లీ: బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో ఇవాళ ప్రత్యేకంగా డ్రోన్ షో నిర్వహించనున్నారు. సుమారు వెయ్యి డ్రోన్లతో ఢిల్లీ గగనవీధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. విజయ్ చౌక్లో జరిగే ఆ వేడుకకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరవుతారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా.. వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో ప్రత్యేక షో నిర్వహించన్నారు. స్టార్టప్ బోట్లాబ్ డైనమిక్స్ ఆ షోను ఆర్గనైజ్ చేస్తోంది. ఐఐటీ ఢిల్లీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. పది నిమిషాల పాటు ఆకాశంలో డ్రోన్స్ విన్యాసాలు చేపట్టనున్నాయి. డ్రోన్ షో సమయంలో సింక్రనైజ్డ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వనున్నారు. చైనా, రష్యా, బ్రిటన్ తర్వాత వెయ్యి డ్రోన్లతో భారీ షో నిర్వహించనున్నట్లు నాలుగవ దేశంగా ఇండియా నిలువనున్నది. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ కూడా ఈ షోకు హాజరవుతారు.
బీటింగ్ రిట్రీట్ ఈవెంట్లో 26 రకాల ప్రదర్శనలు ఉంటాయి. వివిధ రకాల మ్యూజిక్ ట్యూన్స్తో దేశభక్తిని నింపనున్నారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మ్యూజిక్ బ్యాండ్లు ఆకట్టుకోనున్నాయి. వీర్ సైనిక్ ట్యూన్తో బ్యాండ్ ప్లే చేయనున్నారు.