న్యూఢిల్లీ: బీహార్ వలసదారులపై తమిళనాడులో దాడులు జరిగినట్లు ఆరోపిస్తూ ట్వీట్ చేసిన బీజేపీ నేతకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. క్షమాపణలు చెప్పడంతోపాటు ఇకపై బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది ప్రశాంత్ ఉమ్రావ్ (Prashant Umrao ) ఇటీవల ఒక ట్వీట్ చేశారు. బీహార్ వలసదారులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక వీడియో క్లిప్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. అయితే అది తప్పుడు వార్తా కథనమని తమిళనాడు, బీహార్ పోలీసులు నిర్ధారించారు. దీంతో బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్తోపాటు పలువురిపై ఫిర్యాదులు రావడంతో పలు సెక్షన్ల కింద తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 21న ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.
కాగా, బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ షరతులను సవాల్ చేశారు. అలాగే డిలీట్ చేసిన ట్వీట్కు సంబంధించి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నమోదైన కేసులన్నింటినీ క్లబ్ చేయాలని కోరారు. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం ఆయన పిటిషన్లపై గురువారం విచారణ జరిపింది. తమిళనాడు రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ అమిత్ ఆనంద్ తివారీ, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. ప్రశాంత్ ఉమ్రావ్ తరుఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించారు.
మరోవైపు ఇరువైపు వాదనలు విన్న సుప్రీంకోర్టు, బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ చేసిన ట్వీట్పై చీవాట్లు పెట్టింది. మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది. తదుపరి విచారణలోపు దీనిపై క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అలాగే 15 రోజుల పాటు రోజుకు రెండు సార్లు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలన్న బెయిల్ షరతును సవరించింది. ఉమ్రావ్ను సోమవారం సంబంధిత పోలీసు స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించింది. ఆ తర్వాత దర్యాప్తు అధికారికి అవసరమైనప్పుడు తిరిగి హాజరు కావాలని పేర్కొంది.