లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యానాధ్పై ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేయనున్నారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం యోగి ఆదిత్యానాధ్ను ఆయన స్వస్థలం గోరఖ్పూర్ నుంచే అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. దీంతో గోరఖ్పూర్ నుంచి యోగిని ఢీకొనేందుకు ఆజాద్ సమాజ్ చీప్ చంద్రశేఖర్ ఆజాద్ సన్నద్ధమవుతున్నారు.
ఈసారి యోగి అయోధ్య లేదా మధుర స్ధానాల నుంచి పోటీ చేస్తారని సాగిన ఊహాగానాలకు బీజేపీ తెరదించింది. అప్నాదళ్, నిషాద్ పార్టీలతో సీట్ల సర్ధుబాటుతో బరిలో దిగనున్న పాలక బీజేపీ మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని సర్వశక్తులు ఒడ్డుతున్నది.
యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి రావాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ తలపడుతోంది. ఇక ఉనికి చాటుకునేందుకు ప్రియాంక గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ చెమటోడుస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.