న్యూఢిల్లీ, నవంబర్ 12: తీవ్ర వాయుకాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ప్రజలు బయటకు రావడం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని, బయటి పనులను పరిమితం చేసుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సూచించిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వాహనాల వినియోగాన్ని 30 శాతం మేర తగ్గించుకోవాలని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను సీపీసీబీ ఆదేశించింది. ఇందుకుగానూ ఇంటి వద్దే పనిచేయడం (వర్క్ ఫ్రమ్ హోమ్), ఫీల్డ్ కార్యక్రమాలను తగ్గించుకోవడం, షేరింగ్ ప్రయాణం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది.