చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖను పంపారు. పార్టీని వీడాలనే నిర్ణయం బాధాకరమన్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి, సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి సైతం గుడ్బై చెప్పడం పెద్ద దెబ్బగానే రాజకీయ విశ్లేషకులు
భావిస్తున్నారు. సోనియాకు విధేయుడిగా, నాలుగు దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉన్నది.
2020లో జీ-23 గ్రూప్ పార్టీని సమూలంగా మార్పులు చేయాలని సోనియాకు లేఖ రాయగా.. ఆయన సీనియర్ నేతలను సమర్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్కు సైతం సన్నిహితుడు కాగా.. యూపీఏ-1,2లో న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. ఆయన 1976లో గురుదాస్పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ఆఫీస్ బేరర్గా పని చేశారు. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నియామకమయ్యారు.
ఆయన తండ్రి ప్రబోధ్ చంద్ర స్వాతంత్య్ర సమర యోధుడు కాగా. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి, స్పీకర్గా పని చేశారు. అశ్వనీకుమార్ 2002లో రాజ్యసభకు ఎన్నికవగా.. 2016 వరకు కొనసాగారు. గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2006లో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2011లో మళ్లీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రి, అనంతరం న్యాయశాఖ మంత్రిగానూ సేవలందించారు.