వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం ఉన్నట్లు సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. మన పురాణాల్లో జ్ఞానవాపి ఆలయం గురించి క్లుప్తంగా వివరణ ఉన్నట్లు శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టు మండలి అధ్యక్షుడు నాగేంద్ర పాండే తెలిపారు. జ్ఞానవాపిలో జ్యోతిర్లింగం ఉన్నట్లు కూడా మన పురాణాలు చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు ఆలయ కాంప్లెక్స్లో భాగమే అని నాగేంద్ర పాండే తెలిపారు.
3 ఫీట్ల ఎత్తైన శివలింగం..
జ్ఞానవాపి మసీదులోని వజుఖానా ప్రాంతంలో భారీ శివలింగం ఉన్నట్లు తేలడంతో ఆ ప్రాంతాన్ని సీజ్ చేయాలని వారణాసి సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు లాయర్ విష్ణు శంకర్ జైన్ తెలిపారు. సోమవారం సర్వే చేపడుతున్న సమయంలో వజుఖానాలో ఓ బావి ఉందని, దాంట్లో ఉన్న నీటి స్థాయిని తగ్గించాలని కమిషనర్ను కోరామని, నీటి స్థాయి తగ్గిన తర్వాత అక్కడ శివలింగం ఉన్నట్లు గుర్తించామని జైన్ తెలిపారు. ఆ శివలింగం సుమారు 4 మీటర్ల వెడల్పుతో, మూడు ఫీట్ల ఎత్తులో ఉందని గ్రహించారు. ఆ ప్రాంతంలో మరింత లోతుకు వెళ్తే అక్కడ మరింత సమాచారం బయటపడే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. శివలింగం ఉన్నట్లు తెలియగానే ఆ ప్రాంతాన్ని సీజ్ చేయాలని కోర్టును కోరినట్లు చెప్పారు. సీఆర్పీఎఫ్ కమాండోలు ఆ ప్రాంతానికి రక్షణగా నియమించారు. ఆ బావిలో శివలింగం ఉన్నందు వల్ల అక్కడ వుజు చేయరాదు అని లాయర్ కోరారు.