బెంగళూరు: తమ గ్రామంలో కొత్తగా మద్యం షాపు ఏర్పాటు చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసివేయాలని చెప్పినా నిర్వాహకులు వినకపోవడంతో అందులోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. కర్నాటకలోని చిక్కమగళూరులో ఈ ఘటన జరిగింది. ముస్లాపూర్ గ్రామంలో మద్యం దుకాణం తెరిచేందుకు ప్రయత్నించగా గతంలో రెండుసార్లు మహిళలు అడ్డుకున్నారు.
అయినప్పటికీ ఇటీవల కొత్తగా బార్ను ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన స్థానిక, సమీప గ్రామాలకు చెందిన సుమారు 50 మంది మహిళలు శనివారం ఆ మద్యం షాపు వద్ద నిరసన తెలిపారు. బార్ను తెరువడంపై నిర్వాహకులను ప్రశ్నించారు. తమ భర్తలు తాగి ఇక్కడే ఉంటారని, తమ సంసారాలు, కుటుంబాలు నాశనమవుతాయని ఆందోళన చేశారు.
కాగా, మద్యం షాపు, బార్ను మూసివేసేందుకు యజమాని నిరాకరించాడు. దీంతో మహిళలు ఆగ్రహంతో లోపలికి చొరబడ్డారు. అందులోని కుర్చీలు, బల్లలను విసిరి ధ్వంసం చేశారు. అయితే అప్పటికే అందులోని మద్యం సీసాలను నిర్వాహకులు అక్కడి నుంచి తరలించారు.
మరోవైపు దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం ఆ గ్రామానికి వచ్చారు. ముగ్గురు మహిళలు, ఒక బాలుడితోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. కాగా, పోలీసులు మహిళలను ఇండ్ల నుంచి బయటకు ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేశారని వారి కుటుంబాలు ఆరోపించాయి. మరోవైపు లిక్కర్ షాపునకు వ్యతిరేకంగా గళమెత్తిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.