తిరువనంతపురం: కాలికట్ యూనివర్సిటీలో తన వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపిన విద్యార్థుల తీరుపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహహ్మద్ ఖాన్ మండిపడ్డారు. వాళ్లంతా క్రిమినల్స్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ శనివారం కాలికట్ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్కు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఆయన వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు.
ఈ ఘటనపై గవర్నర్ ఆరిఫ్ ఖాన్ సీరియస్ అయ్యారు. తనపై విద్యార్థులు దాడికి ప్రయత్నించారని, వారంతా క్రిమినల్స్ అని మండిపడ్డారు. తనపై దాడికి ప్రయత్నించిన విద్యార్థుల వెనుక ముఖ్యమంత్రి పినరయి విజయన్ హస్తం ఉందని ఆరోపించారు. సీఎం విజయనే నిరసనకారులను తనపైకి ఉసిగొలిపాడని విమర్శించారు.
కాగా, గవర్నర్ ఆరిఫ్ పలు యూనివర్సిటీల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులను వివిధ పదవులకు నామినేట్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాలికట్ యూనివర్సిటీ సందర్శనకు రావటంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసనకు దిగారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన గవర్నర్.. తాను కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారినని చెప్పారు. విద్యార్థుల ముసుగులో ఉన్న నేరస్థులకు జవాబుదారిని కాదన్నారు.