చండీగఢ్: పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్కు (Sukhbir Badal) సిక్కుల అత్యున్నత మత కోర్టు అకల్ తఖ్త్ శిక్ష విధించింది. మత దుష్ప్రవర్తనకు పాల్పడిన ఆయన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్తో సహా పలు గురుద్వారాల వంటగదిలోని పాత్రలు, టాయిలెట్లను క్లీన్ చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 3న మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ విధులు నిర్వర్తించాలని పేర్కొంది. ఆ తర్వాత స్నానమాచరించి లంగర్ వడ్డించాలని సూచించింది. అకల్ తఖ్త్ జతేదార్ గియానీ రఘ్బీర్ సింగ్ సోమవారం అమృత్సర్లో పంజ్ పియారే (ఐదుగురు ప్రధాన సిక్కు పూజారులు) సమక్షంలో ఈ తీర్పును చదివి వినిపించారు. వీల్చైర్లో హాజరైన సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ తీర్పును అంగీకరించారు.
కాగా, 2015లో గురు గ్రంథ్ సాహిబ్ పట్ల దుష్ప్రవర్తనకు పాల్పడిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్కు అనుకూలంగా నాటి డిప్యూటీ సీఎం సుఖ్బీర్ బాదల్, ఆయన కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలు వ్యవహరించడంపై సిక్కుల సర్వోన్నత మత కోర్టు అకాల్ తఖ్త్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాదల్తో సహా వారంతా మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఈ ఏడాది ఆగస్ట్లో నిర్ధారించింది. దీంతో బాదల్ తన తప్పులను అంగీకరించారు. ఆ కమిటీకి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. వీలైనంత త్వరగా శిక్షను ప్రకటించాలని సిక్కుల సుప్రీంకోర్టుగా పిలిచే అకల్ తఖ్త్ను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్తో సహా పలు గురుద్వారాలలో వంటగది, బాత్రూమ్లలో శుభ్రపరిచే విధులు చేయాలని ఆ కమిటీ ఆదేశించింది.
మరోవైపు గుర్మీత్ రామ్ రహీమ్ను క్షమించిన బాదల్ తండ్రి, పంజాబ్ మాజీ సీఎం అయిన దివంగత ప్రకాష్ సింగ్ బాదల్, సమాజానికి చేసిన సేవలకు గాను 2011లో ఆయనకు ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) అన్న బిరుదును కూడా అకల్ తఖ్త్ తొలగించింది.