ముంబై: మహారాష్ట్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్, ఎన్సీపీ అధినేత శరద్పవార్ సోదరుడి కుమారుడు అజిత్పవార్ 2019 నవంబర్ నుంచి ఇప్పటివరకు గడిచిన మూడున్నరేండ్లలో మూడుసార్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఈ మూడు పర్యాయాల్లోనూ వేర్వేరు వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. కొన్ని రోజుల తర్వాత అజిత్పవార్కు గాలం వేసిన బీజేపీ.. ఆయన వర్గం ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుతో 2019 నవంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారాలు చేశారు.
అయితే, కేవలం రెండు రోజుల్లోనే శరద్పవార్ చక్రం తిప్పి అజిత్పవార్ను వెనక్కి రప్పించారు. దాంతో బీజేపీ సర్కారు కూలిపోయింది. ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి మహాకూటమి పేరుతో 2019 డిసెంబర్ మొదట్లో సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. అప్పుడు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, అజిత్ పవార్ రెండోసారి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు.
కానీ, ఆ తర్వాత కొన్ని నెలలకే బీజేపీ కుట్ర చేసి శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండేకు గాలం వేసింది. దాంతో ఏక్నాథ్ షిండే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను చీల్చి శివసేనను దెబ్బకొట్టాడు. అందుకు ప్రతిఫలంగా బీజేపీ అతనికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. దేవేంద్ర ఫడ్నవీస్ను ఉప ముఖ్యమంత్రిని చేసింది. అజిత్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ వచ్చాడు.
ఇప్పుడు తాజాగా బీజేపీ మరోసారి అజిత్పవార్కు ఎరవేసింది. దాంతో ఆయన రెండోసారి పార్టీని చీల్చి మహారాష్ట్రలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు మద్దతు ప్రకటించాడు. దాంతో షిండే ప్రభుత్వం అతనికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది. ఇప్పుడు సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో అజిత్పవార్ మూడోసారి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.