మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రోడ్షో నిర్వహించారు. ఆ రోడ్షోకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దారిపొడుగునా జెండాలతో స్వాగతం పలికారు. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసద్ ఆ ర్యాలీలో పాల్గొన్నారు. సెకండ్ వేవ్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని, కరోనాతో వేలాది మంది యూపీలో సెకండ్ వేవ్ సమయంలో మరణించినట్లు అసద్ ఆరోపించారు. అనేక మంది మృతదేహాలు.. యూపీ నదుల్లో కొట్టుకువచ్చినట్లు తెలిపారు. దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం యోగి.. కరోనా నియంత్రణలో విఫలం అయినట్లు ఆయన ఆరోపించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎవరితోనైనా కూటమి కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అసద్ చెప్పారు. యూపీలో బాగీదారీ సంకల్ప్ మోర్చాతో మజ్లిస్ పార్టీ జతకట్టింది.