తమిళనాడు హెలికాప్టర్ దుర్ఘటనలో దుర్మరణం పాలైన బ్రిగేడియర్ లిద్దర్ కుమార్తె ఆష్నా లిద్దర్ పుస్తకానికి ఒక్కసారిగా భారీగా డిమాండ్ పెరిగింది. ఎక్కడ చూసినా “సోల్డవుట్” అన్న బోర్డే కనిపిస్తోంది. బ్రిగేడియర్ లిద్దర్ కుమార్తె పేరు ఆష్నా లిద్దర్. ఆమె వయస్సు కేవలం 17 సంవత్సరాలే. In Search of a Title: Musings Of A Teenager పేరుతో ఆమె ఓ పుస్తకం రచించింది. ఇందులో ఓ యువకుడి అనుభవాలు, ఆయన ఆలోచనా రీతులు, అధ్యయనం చేసే విధానం మొదలైన విషయాలున్నాయి. తమిళనాడు హెలికాప్టర్ దుర్ఘటనలో బ్రిగేడియర్ లిద్దర్ మరణం తర్వాతే ఆయన కూతురు రచించిన ఈ పుస్తకానికి డిమాండ్ ఒక్క సారిగా పెరిగిపోయింది.
ఈ విషయాన్ని Creative Crows పబ్లిషింగ్ హౌజ్ కూడా ధృవీకరించింది. ఒక్కసారిగా ఈ పుస్తకానికి డిమాండ్ పెరిగిందని, ఎక్కడెక్కడి నుంచో ఈ పుస్తకం పంపాలంటూ తమకు డిమాండ్లు వస్తున్నాయని బాధ్యులు తెలిపారు. మొదట కేవలం 250 పుస్తకాలను మాత్రమే ప్రచురించామని, డిమాండ్ పెరగడంతో మరిన్ని పుస్తకాలను ప్రచురిస్తున్నామని, ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించేశామని పబ్లికేషన్ బాధ్యులు పేర్కొంటున్నారు.