న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం పెరుగుతున్నది. గురువారం కాలుష్యంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాల తీరుపై మండిపడింది. ఈ క్రమంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పాఠశాలలు మూసే ఉంటాయని పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ వెల్లడించారు. ఢిల్లీలో వాయుకాలుష్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదని, ఈ కారణంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వ, గుర్తింపు పొందిన, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC), మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ కటోన్మెంట్ బోర్డ్లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో పాఠశాలలను మూసివేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పొల్యూషన్ను దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. బోర్డుకు సంబంధించిన పరీక్షలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు నడుస్తాయని పేర్కొన్నారు.
ఆందోళనకరంగా గాలి నాణ్యత సూచీ
ఢిల్లీతో పాటు నేషనల్ జాతీయ రాజధాని ప్రాంతం (NCR) ప్రాంతంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రెండు మూడు రోజులు కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత మళ్లీ క్షీణించి.. తీవ్ర స్థాయికి చేరుకున్నది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఐఎస్బీటీలో గాలి నాణ్యత సూచీ (AQI) గురువారం ఉదయం 9 గంటలకు తీవ్ర కేటగిరిలో 448గా నమోదైంది. శీతాకాలం నేపథ్యంలో పొగమంచు పేరుకుపోయింది. రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.