న్యూఢిల్లీ: ఉత్తరాదిలో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA bloc) నాయకత్వం మార్పు కోసం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) డిమాండ్ చేసింది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు పొందిన కాంగ్రెస్ను ఆయన నిందించారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప బీజేపీ గెలుపు కాదని అన్నారు. ‘మూడు రాష్ట్రాల ఫలితాలు బీజేపీ విజయగాథ కంటే కాంగ్రెస్ వైఫల్యమే ఎక్కువ’ అని విమర్శించారు.
కాగా, వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో ‘భారత’ కూటమి అవకాశాలపై అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపబోవని కునాల్ ఘోష్ తెలిపారు. ‘దేశంలో బీజేపీని ఓడించే యుద్ధంలో నాయకత్వాన్ని అందించే పార్టీ టీఎంసీ’ అని ఎక్స్లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గెలువాలంటే మమతా బెనర్జీ సంక్షేమానికి ప్రతిపక్షాలు కట్టుబడి ఉండాలన్నారు.