న్యూఢిల్లీ, మే 11: కరెంటు సంక్షోభంతో దేశంలో కమ్ముకొన్న చీకట్లు కొందరికి వెలుగులు పంచుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు కొరత కొన్ని కంపెనీలకు సిరులు కురిపిస్తున్నది. కేంద్రప్రభుత్వం కూడా వారికే దన్నుగా నిలుస్తుండటంతో సామాన్యుల కష్టఫలమంతా ఒకరిద్దరి జేబుల్లోకే వెళ్తున్నది. గత కొన్ని నెలలుగా దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో అత్యధికంగా లాభపడింది ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడైన గుజరాత్ వ్యాపారి గౌతమ్ అదానీ అని పలు సర్వేలు చెప్తున్నాయి.
బొగ్గు వారిదే.. కరెంటూ వారిదే
విదేశాల నుంచి భారత్కు అత్యధికంగా బొగ్గు ఎగుమతి చేస్తున్న కంపెనీ అదానీ గ్రూప్. దేశంలో అత్యధికంగా థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న కంపెనీ కూడా అదానీ గ్రూపే. అదానీ పవర్ కంపెనీ థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 12,450 మెగావాట్లు. మరో 40 మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యం కూడా ఈ గ్రూప్కు ఉన్నది. ఈ వేసవిలో ఒక్కసారిగా విద్యుత్తు డిమాండ్ పెరగటంతో సగానికిపైగా రాష్ర్టాల్లో సైప్లెకి, డిమాండ్కు మధ్య భారీ అంతరం ఏర్పడింది. దాంతో గంటలకొద్దీ కరెంటుకోతలు విధించాయి. ఇదే సమయంలో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన బొగ్గుకు కూడా కొరత ఏర్పడింది. విద్యుత్తు డిమాండ్ను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవటంతో కోట్ల మంది ప్రజలు అంధకారంలో మగ్గాల్సి వస్తున్నది. బొగ్గు సరఫరాలో అంతరాయంతో వందలకొద్ద రైళ్లను కూడా రద్దుచేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్టు సంక్షోభం ముదిరిన తర్వాత కండ్లు తెరిచిన మోదీ సర్కారు, దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ స్థాపిత సామర్థ్యానికి వందశాతం విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ఈ నెల 5న ఆదేశించింది. అందులో ప్రభుత్వం పెట్టిన షరతు అదానీ గ్రూప్నకు సిరులు కురిపిస్తున్నది. థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 10 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్నది కలుపాలని ఎలక్ట్రిసిటీ చట్టం సెక్షన్ 11 ప్రకారం ఆదేశించింది. దీంతో గతంలో ఇది నాలుగు శాతమే ఉండేది. మోదీ ప్రభుత్వ తాజా ఆదేశంతో కంపెనీలన్నీ అనివార్యంగా విదేశీ బొగ్గును కొనాల్సి వస్తున్నది. ఈ షరతు ఈ ఏడాది అక్టోబర్ 31 వరక అమల్లో ఉండనున్నది.
రేట్లు ఫుల్.. బొగ్గు నిల్
దేశంలో థర్మల్ విద్యుత్తు సంస్థల వద్ద నిబంధనల ప్రకారం కనీసం 24 రోజులపాటు విద్యుత్తు ఉత్పత్తి చేయటానికి సరిపడా బొగ్గు నిల్వ ఉండాలి. కానీ ఐసీఆర్ఏ లెక్కల ప్రకారం ఈ నెల 7న కేవలం 8 రోజులకు సరపడా నిల్వలే ఉన్నాయి. దేశంలో బొగ్గు కొరత ఏ స్థాయిలో ఉన్నదో ఈ లెక్కలే రుజువు చేస్తున్నాయి. దేశీయంగా బొగ్గు కొరత కారణంగా చాలా కంపెనీలు విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవటంపై దృష్టిపెట్టాయి. కానీ, అది మోయలేని భారంగా తయారైంది. గత 12 నెలల్లో దిగుమతి చేసుకొనే బొగ్గు ధరలు 150 శాతం పెరిగాయి. ఇప్పుడు కేంద్రం కచ్చితంగా 10 శాతం ఇంపోర్టెడ్ బొగ్గును వాడాలన్న నిబంధన పెట్టడంతో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. విదేశీ బొగ్గు ధరలు ఆకాశాన్నంటిన వేళ దేశీయ బొగ్గులో 10 శాతం విదేశీ బొగ్గును కలుపాలన్న కేంద్రం ఆదేశంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఎవరికి ప్రయోజనం కలిగించేందుకు ఈ షరతు పెట్టారని నిలదీస్తున్నారు. అసలు దేశంలో బొగ్గు పుష్కలంగా ఉండగా కొరత ఎందుకొచ్చిందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
విద్యుత్తు రేట్ల పెంపునకు కమిటీ
బొగ్గు రేట్లు పెరగటం, విద్యుత్తుకు డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరగటంతో ఉత్పత్తి సంస్థలు విద్యుత్తు రేట్లు పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఒప్పందాల ప్రకారం తాత్కాలికంగా బొగ్గువంటి ముడి సరుకులు ధరలు పెరిగితే డిస్కంలకు అమ్మే విద్యుత్తుకు ధరలు పెంచే అవకాశం ఉత్పత్తి సంస్థలకు లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం తెలివిగా రేట్ల పెంపుపై కేంద్ర విద్యుత్తు శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కమిషన్ అధికారులతో కమిటీ వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు రేట్లు 4.5 నుంచి 5 శాతం పెంచే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంటే యూనిట్కు 50 పైసల నుంచి 80 పైసలు అధికంగా డిస్కంలు చెల్లించాల్సి రావచ్చు. ఈ భారాన్ని అంతిమంగా డిస్కంలు వినియోగదారులపైనే వేస్తాయి.
అదానీకి ఎలా లాభం?
మన దేశానికి అత్యధికంగా బొగ్గును ఎగుమతి చేస్తున్న కంపెనీ అదానీ గ్రూప్. ఇంపోర్టెడ్ బొగ్గు ధరలు ఏకంగా 150 శాతం పెరగటం, దేశంలోని థర్మల్ కంపెనీలన్నీ 10 శాతం ఇంపోర్టెడ్ బొగ్గు వాడాలని మోదీ సర్కారు హుకుం జారీచేయటంతో ఆ కంపెనీ భారీగా లాభపడుతున్నది. అదే సమయంలో దేశంలో అత్యధికంగా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న సంస్థ కూడా అదే కావటం, కొరత కారణంగా ఇప్పుడు విద్యుత్తు రేట్లు పెంచుకొనే అవకాశం ఉండటంతో ఈ విధంగా కూడా ఆ కంపెనీ భారీగా ప్రయోజనం పొందనున్నది. దీంతో ముంబై స్టాక్ ఎక్సేంజీలో అదానీ గ్రూప్ షేర్ ఒక్క ఏప్రిల్ నెలలోనే 69 శాతం పెరిగింది.
ఎన్టీపీసీకి 10 లక్షల టన్నుల బొగ్గు సరఫరా
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీకి రెండేండ్లపాటు బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టు అదానీ గ్రూప్కే దక్కింది. గత ఏడాది అక్టోబర్లో 10 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం ఎన్టీపీసీ టెండర్లు ఆహ్వానించింది. ఈ ఏడాది జనవరిలో ఆ టెండర్ను అదానీ గ్రూప్ గెలుచుకొన్నదని పేరు చెప్పటానికి ఇష్టపడని ఎన్టీపీసీ అధికారి ఒకరు తెలిపారు. కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా అదానీ గ్రూప్నకే 10 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది.
అదానీ గ్రూప్నకు రైల్వే లైన్లు
దేశ చరిత్రలో ఇప్పటివరకు బొగ్గు సరఫరా మొత్తం భారతీయ రైల్వేల ఆధ్వర్యంలోనే నడుస్తూ వస్తున్నది. కానీ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాసింజర్ రైళ్లతోపాటు గ్రూడ్స్ రైళ్లను కూడా ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి బొగ్గును గోవాలోని మార్మగోవా పోర్టుకు సరఫరా చేసే రైల్వే లైన్ను అదానీ కుటుంబానికి అప్పగించినట్టు ఆర్టీఏ కింద నిహర్ గోఖలే అనే జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. మార్మగోవా పోర్టు కూడా అదానీ గ్రూప్ చేతిలోనే ఉన్నది.