ఇండోర్, జనవరి18: కోచింగ్ సెంటర్లో పాఠాలు వింటూనే ఓ విద్యార్థి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన అతడిని దవాఖానకు తరలించినా ప్రాణం దక్కలేదు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం ఉదయం చోటుచేసుకున్నది. రాష్ట్రంలోని సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధి (20) మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇండోర్లోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు.
గురువారం ఉదయం కోచింగ్ క్లాస్కు హాజరైన రాజా.. క్లాస్ వింటూనే ఛాతిలో నొప్పి అంటూ పక్కన కూర్చున్న విద్యార్థికి చెప్తూనే అతడిపై ఒరిగాడు. అతడు రాజా వీపు నిమురుతూ లెక్చరర్కు చెప్పే ప్రయత్నం చేస్తుండగా, క్షణాల్లోనే కుర్చీలోని నుంచి నేలపై రాజా పడిపోయాడు. వెంటనే అతడిని సమీప దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.