Sepoy mutiny | బ్రిటిష్ వారు భారతదేశంలో పాలన ఏర్పరుచుకున్నాక వందేండ్ల వరకు ఏవో చిన్నచిన్న తిరుగుబాట్లే తప్ప పెద్దయెత్తున పోరాటాలు జరగలేదు. చివరికి 1857లో వందేండ్ల వేదనంతా ఒక్కసారిగా సిపాయీల తిరుగుబాటు రూపంలో బద్దలైంది.
వ్యాపారం కోసం అడుగుపెట్టిన ఒక విదేశీ వర్తక సంస్థ మొగల్ సామ్రాజ్య వైభవం మసకబారుతున్న దశలో దేశంలో ఒక్కొక్క రాజ్యాన్నీ కబళించింది. తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకుంది. దాంతో అసంతృప్తితో ఉన్న రాజులు కంపెనీకి వ్యతిరేకంగా కత్తిదూశారు. చేతివృత్తుల పరిశ్రమలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం మీద ఒత్తిడి పెరిగింది. అలా రైతాంగంలో, చేతివృత్తుల వారిలోనూ అసంతృప్తి పేరుకుపోయింది. వీటికితోడు తమ సొంతదేశంలో తమను చిన్నచూపు చూడటం, భారతీయ సిపాయీలకు తక్కువ వేతనాలు లాంటివి కూడా సిపాయీల తిరుగుబాటుకు కారణాలు. ఇన్ని సమస్యలతోపాటు ‘పుండుమీద కారం చల్లినట్లు’ సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన కొవ్వు పూతపూసిన కార్ట్రిడ్జిలు కూడా తిరుగుబాటును త్వరితం చేశాయి.
ఈ నేపథ్యంలోనే 1857 మార్చి 29న బారక్పూర్లో మంగళ్ పాండే అనే సిపాయి పూతపూసిన తూటాలను ఉపయోగించేది లేదని తేల్చిచెప్పాడు. అక్కడున్న అధికారులపై దాడిచేశాడు. ఒకరిని చంపేశాడు కూడా. దాంతో ఆంగ్ల ప్రభుత్వం మంగళ్ పాండేను ఉరితీసింది. తిరుగుబాటు అధికారికంగా ప్రారంభమైంది మాత్రం మే 10న మీరట్ సిపాయీలు ఢిల్లీ బాటపట్టినప్పుడే. 11న ఢిల్లీ చేరుకున్న సిపాయీలు వృద్ధుడైన బహదూర్ షాను తమ నాయకుడిగా ప్రకటించారు.
ఆ మరునాడు ఢిల్లీని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. బహదూర్ షా నేరుగా పోరాటంలో పాల్గొనక పోయినా ఆయన ప్రతినిధిగా బఖ్త్ఖాన్ (ఢిల్లీ), నానాసాహెబ్, తాంత్యాతోపే (కాన్పూర్), బేగం హజ్రత్ మహల్ (లక్నో), లక్ష్మీబాయి (ఝాన్సీ), కువర్ సింగ్ (జగదీశ్పూర్) బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. ఆంగ్లేయులకు ఆధునిక ఆయుధాలు, రవాణా సాధనాలు అందుబాటులో ఉన్న కారణంగా తిరుగుబాటు రెండేండ్లలోపే సమసిపోయింది. తర్వాత మళ్లీ తొంభై ఏండ్లకు భారత్ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది.