ఆగ్రా, ఫిబ్రవరి 3: తాజ్మహల్ వద్ద ఉర్సు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని అఖిల్ భారత్ హిందూ మహాసభ దాఖలు చేసింది. ఈ నెల 6 నుంచి మూడు రోజుల పాటు ఉర్సు నిర్వహించనున్నారని, దీనిపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఉర్సు సందర్భంగా తాజ్మహల్లోనికి ఉచిత ప్రవేశానికి అనుమతిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
తాజ్మహల్కు ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు ఉన్నదని, అయితే దీన్ని నిర్మించిన షాజహాన్ చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ ఉర్సు నిర్వహించడం తగదని తెలిపింది. వాస్తవానికి తాజ్మహల్ లోపల ఉర్సును నిర్వహించడానికి అప్పట్లో మొఘలులు, బ్రిటీష్ వాళ్లు కూడా అనుమతించలేదని, ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడిందని వెల్లడించింది. కాబట్టి ఈ నెల 6 నుంచి జరుగనున్న ఉర్సుపై నిషేధం విధించాలని కోరింది. ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం మార్చి 4న విచారణ జరుపుతామని వెల్లడించింది.