తిరువనంతపురం: ఇప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని మరో కేరళ స్టోరీ (Untold Kerala Story) వెలుగులోకి వచ్చింది. కేరళ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు ప్రతి రోజు తమకు తెలియని వారి కోసం తమ ఇళ్లలో భోజనం వండి ప్యాక్ చేసి ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద రోగులు, వారి బంధువులు, అన్నార్తుల కడుపులునింపుతున్నారు. తమ వంతు వచ్చిన ప్రతి మహిళ తన కుటుంబంతోపాటు మరోకరు లేదా ఇద్దరికి సరిపోయేలా ఇంటిలోనే ఆహారం వండుతుంది. వాటిని ప్యాక్ చేసి కలెక్ట్ చేసే వారికి ఇస్తుంది. వారు ఆ ఆహార పొట్లాలను ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద, ఆహారం కావాల్సిన వారికి పంపిణీ చేస్తారు.
2017లో కేవలం 300 ఆహార పొట్లాలతో మొదలైన ఈ ఉద్యమం నేడు 40,000 మీల్స్ ప్యాకెట్లకు చేరింది. ‘పోతిచోరు’ (pothichoru) గా పిలిచే ‘భోజనం పొట్లం’ ఉద్యమానికి కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం యువజన సంస్థ అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) శ్రీకారం చుట్టింది. 2017 జనవరి 1న తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 300 ఆహార పొట్లాల పంపిణీతో దీనిని ప్రారంభించారు. పేదల కోసం చేపట్టిన ఈ ప్రచారాన్ని ‘హృదయపూర్వం’ (Hrithayapoorvvam’) అని వ్యవహరిస్తారు. సాధారణ భాషలో ‘హార్టీ మీల్ పార్సెల్’ అని పేర్కొంటారు.
కాగా, ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం కోసం కమ్యూనిటీ కిచెన్లు వంటి ఏమీ ఉండవు. 14 జిల్లాలకు చెందిన గృహిణులే తమ వంతు వచ్చినప్పుడు తమ కుటుంబంతోపాటు ఇతరుల కోసం కూడా వంట చేస్తారు. వండిన ఆహారాన్ని ప్యాక్ చేస్తారు. డీవైఎఫ్ఐ కార్యకర్తలు ఆయా ఇళ్లకు వెళ్లి ఫుడ్ పార్సిల్స్ను కలెక్ట్ చేస్తారు. కేరళ వ్యాప్తంగా సుమారు 50కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రతి రోజూ ఆ ఆహార పొట్లాలను పంపిణీ చేస్తారు.
అయితే దీని కోసం ఏడాది వరకు కమిటీలు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఏ రోజు ఏ ఇంట్లో అదనంగా ఆహారం వండాలో అన్నది ముందు రోజున ఆ ఇంటి మహిళకు తెలియజేస్తారు. కేవలం ఒకరికి మాత్రమే మిల్స్ ప్యాక్ ఇవ్వాలని కోరినప్పటికీ కొందరు మహిళలు ఇద్దరు లేదు ముగ్గురి కోసం వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి అందిస్తుంటారు. తమ కోసం ఏది వండితే అదే ఆహారాన్ని ఇతరుల కోసం ఇస్తారు. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించే ఉదాత్తమైన సేవగా వారు పేర్కొంటారు. కరోనా కాలంతోపాటు వరదలు వంటి విపత్తుల సమయాల్లో కూడా తమ వంతు సహాయ సహకారాలను వేలాది మంది మహిళలు అందించారు.
కాగా, ఈ మహోన్నత సేవా కార్యక్రమంలో కేవలం మహిళలే కాదు వారి పిల్లలు కూడా భాగమవుతారు. కొన్నిసార్లు పెద్దలు అందుబాటులో లేనప్పుడు పిల్లలే ఆహారం తయారు చేసి ప్యాక్ చేసి ఆ కార్యకర్తలకు అందిస్తారు. ఇలాంటి సందర్భాల్లో తాము వండిన ఆహారం సరిగా లేకపోతే క్షమించాలంటూ ఒక చీటిలో రాసి ఆ ఆహార పొట్లాలలో ఉంచుతారు. అలాగే ఆ ఆహారం అందుకున్న రోగులు త్వరగా కోలుకోవాలని కూడా ఆ చీటీలో పేర్కొంటారు. ఇలాంటి ఆహార పొట్లం అందుకున్న టీచర్ రాజేష్ మోంజీ, ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఏడాది జనవరిలో తన తల్లికి చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక బాలిక వండిన భోజనం పార్సిల్ను ఆయన అందుకున్నారు. ఆ పాప తయారు చేసిన ప్రతి అన్నం గింజ ప్రేమతో నిండి ఉందని తన పోస్ట్లో ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఈ భోజనం పంపిణీ కార్యక్రమం కేవలం దాతృత్వం కోసం మాత్రమే కాదని సీపీఎం రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీమ్ అన్నారు. ఈ ఉదారవాద సేవా కార్యక్రమం ద్వారా యువత స్వార్థపూరితం కాని వాతావరణంలో ఎదుగుతారని తెలిపారు. ఈ చొరవ ద్వారా తమ జీవితంలో ఎన్నడూ చూడని, ఆకలితో ఉన్న వారికి భోజనం పంపిణీ చేయడానికి యువత ముందుకు వస్తున్నారని చెప్పారు. ‘హృదయపూర్వ్వం పోతిచోరు’ అంటే కేవలం ఆహారం మాత్రమే కాదని, దాతృత్వ గుణం, ఆ కళను పిల్లలకు నేర్పడం అని అన్నారు. ఆరేళ్లుగా కులమతాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. ఇందుకు సహకరించే ప్రతి ఇంటికి ఆరు నెలలకు ఒకసారి వారి వంతు వస్తుందని చెప్పారు. పూర్తిగా ప్రభుత్వ పింఛన్పై ఆధారపడే వృద్ధ దంపతులకు కూడా మహిళలు తమ ఇంట్లో వండిన ఈ ఆహార పొట్లాలను అందిస్తున్నట్లు వెల్లడించారు.