న్యూఢిల్లీ, అక్టోబర్ 11: గత ఏడాది పోక్సో చట్టం కింద నమోదైన నేరాల్లో 99 శాతానికి పైగా బాలికలపైనే జరిగాయని జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) డాటా తెలియజేస్తున్నది. మొత్తం 28,327 మంది బాధితుల్లో 28,058 మంది బాలికలేనని ఎన్సీఆర్బీ డాటాను విశ్లేషించిన ‘చైల్డ్ రైట్స్ అండ్ యూ’ అనే సంస్థ పేర్కొంది. బాధిత బాలికల్లో 16 నుంచి 18 ఏండ్ల వయస్కులు అత్యధికంగా 14,092 మంది ఉన్నారు. వారి తర్వాత 12 నుంచి 16 ఏండ్ల బాలికలపై ఎక్కువగా లైంగిక నేరాలు జరిగాయి. ఈ వయసు బాధితులు 10,949 మంది ఉన్నారు. సమాజంలో బాలికలు ఇప్పటికీ దుర్భలులుగానే ఉన్నారని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం.