న్యూఢిల్లీ, జూలై 23: వాషింగ్ మెషిన్ బట్టలు ఉతకాలంటే పిడికెడు సర్ఫ్, బకెట్ నిండా నీళ్లు కావాలి. ఓ రెండు, మూడు గంటల పాటు కిందేసి, మీదేసి.. తిప్పి తిప్పి.. మురికిని వదిలిస్తుంది. కానీ, 80 సెకన్లలోనే, కేవలం సగం కప్పు నీళ్లతో.. అదీ డిటర్జెంట్ అవసరమే లేకుండా బట్టలను శుభ్రం చేస్తే! అద్భుతమే కదా. దాన్ని సుసాధ్యం చేసి చూపించిందో భారత స్టార్టప్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాషింగ్ మెషిన్లు ఒక టేబుల్ స్పూన్ మురికిని పోగొట్టేందుకు దాదాపు 100 లీటర్ల నీటిని తీసుకొంటాయి. రసాయనాలతో తయారు చేసిన డిటర్జెంట్లు వాడాలి. దుర్వాసన పోవటానికి ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్లు వాడాలి. మొత్తంగా చూస్తే పర్యావరణానికి తప్పని హాని. ఈ సమస్యకు చండీగఢ్కు చెందిన ‘80 వాష్’ స్టార్టప్ చెక్ పెట్టనున్నది. నీటి వృథాను అరికట్టి, రసాయనాల వాడకాన్ని తగ్గించే వాషింగ్ మెషిన్ను స్టార్టప్కు చెందిన రుబుల్ గుప్తా, నితిన్ కుమార్ సలూజా, వీరేందర్ సింగ్ రూపొందించారు.
ఈ వాషింగ్ మెషిన్ ఐఎస్పీ స్టీమ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. అంటే.. పొడి ఆవిరి, అయనీకరణ చేయని మైక్రో కిరణాలతోనే బట్టలు శుభ్రం అవుతాయన్న మాట. వస్ర్తాలను ఈ వాషింగ్ మెషిన్లో వేయగానే అయానీకరణ చేయని మైక్రో కిరణాలు బట్టలపై పేరుకొన్న బ్యాక్టీరియాను పూర్తిగా చంపేస్తాయి. తర్వాత సగం కప్పు నీళ్లు పొడి ఆవిరిగా మారి బట్టలపై ఉన్న మురికిని, దుర్వాసనను తొలగిస్తాయి. ఇలా ఒక దశ పూర్తి కావటానికి 80 సెకన్ల సమయాన్నే తీసుకొంటుంది. మురికి ఎక్కువగా ఉంటే.. పలు దశల్లో పని చేసి మురికిని వదిలిస్తుంది.
పంజాబ్లోని చిత్కార యూనివర్సిటీ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్వర్క్ డైరెక్టర్ నితిన్ కుమార్, ఆస్టోసింక్ ఇన్నోవేషన్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ వీరేందర్, బీటెక్ విద్యార్థి రుబుల్ కలిసి దవాఖానల కోసం యూవీ కిరణాలతో పనిచేసే ఇన్స్టంట్ స్టెరిలైజేషన్ మెషిన్ను తయారు చేశారు. పర్యావరణానికి మేలు కలిగించేలా ఆ మెషిన్ను మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించిన వారికి 80వాష్ ఆలోచన తట్టింది. యూవీ కిరణాలతో బట్టల మురికిని వదలగొట్టడం వీలు కాదని తెలిసి, పొడి ఆవిరిని కూడా ఉపయోగించారు. అనుకొన్నట్టే వారి కృషి ఫలించింది. ప్రస్తుతం చండీగఢ్, పంచకుల, మొహాలీలోని హాస్టల్స్, దవాఖానలు, సెలూన్లలో ట్రయల్స్ కొనసాగిస్తున్నారు. వీరి ఆవిష్కరణకు ఐఎస్పీ స్టీమ్ టెక్నాలజీ పేటెంట్ కూడా దక్కింది.