చెన్నై: తమిళనాడులోని 71 ఏళ్ల వృద్ధురాలి ఆధార్, పాన్ కార్డు వివరాలను దుర్వినియోగం చేశారు. ఆ కార్డులతో ఓ నకిలీ జీఎస్టీ(GST Fraud) రిజిస్ట్రేషన్ చేసి సుమారు 2.53 కోట్ల పన్ను ఎగ్గొట్టారు. ఈ ఘటనలో ఆమె బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేశారు. కృష్ణగిరి జిల్లాలోని ఉత్తంగరై మున్సిపాల్టీలో ఉన్న ఇందిరా నగర్లో 71 ఏళ్ల లక్ష్మీ నివసిస్తున్నది. అయితే తన ఆధార్, పాన్ వివరాలను దుర్వినియోగం చేసినట్లు కృష్ణగిరి జిల్లాలో ఆమె ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరింది.
ఇటీవల డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ఆ మహిళ బ్యాంకుకు వెళ్లింది. అయితే కమర్షియల్ ట్యాక్స్ శాఖ తన అకౌంట్ను ఫ్రీజ్ చేసినట్లు బ్యాంకు అధికారులు చెప్పారు. కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రకారం లక్ష్మీ పేరుతో ఓ ప్రైవేటు కంపెనీ రిజిస్టర్ చేశారు. ఆ కంపెనీ పేరు మీద సుమారు రెండున్నర కోట్ల జీఎస్టీ బకాయిలు ఉన్నాయి. అది కూడా 2018-19 ఆర్థిక సంవత్సరానికి.
వాణిజ్య పన్నుల శాఖ చెప్పినట్లు తనకు ఏ కంపెనీతోనూ సంబంధం లేదని బాధితురాలు లక్ష్మీ చెప్పింది. అలాంటి వ్యాపారం చేయలేదన్నారు. జీఎస్టీ బకాయిల అంశంలో ఆ వృద్ధిరాలి కుమారుడు రామకృష్ణ బ్యాంక్ అకౌంట్ను కూడా సీజ్ చేశారు. రామకృష్ణ ఓ రోజువారీ కూలి, మరో బ్యాంకు బ్రాంచ్లో అతను సేవింగ్స్ ఖాతా మెయింటేన్ చేస్తున్నాడు. దీనిపై డిటేల్గా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను లక్ష్మీ కోరింది. ఫ్రీజైన అకౌంట్లను మళ్లీ తెరవాలని ఆమె వేడుకున్నారు.