న్యూఢిల్లీ: మార్నింగ్ టీ తీసుకురావడంతో ఆలస్యం కావడం వల్ల భార్య తలను నరికేశాడో(Behead) ఉన్మాది భర్త. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్లో జరిగింది. 50 ఏళ్ల సుందరి అనే మహిళను చంపిన కేసులో ధర్మవీర్ను అరెస్టు చేశారు. టీ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత ధర్మవీర్ తన భార్యను చంపేసినట్లు పోలీసులు తేల్చారు. టీ తయారు చేసేందుకు సమయం పడుతుందని సుందరి చెప్పడంతో భర్త ఆమెతో గొడవకు దిగారు. మరో రూమ్లో తమ నలుగురు పిల్లలు నిద్రిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అరపులు వినబడడంతో సమీపంలో ఉన్న వారు ఇంటికి వచ్చారు. అప్పటికే సుందరి రక్తపు మడుగులో ఉంది. పోస్టుమార్టమ్ కోసం ఆమె శరీరాన్ని పంపారు. టీ తయారీ విషయంలో గొడవ ప్రారంభం కాగానే వెనుక నుంచి సుందరి మెడపై తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో అటాక్ చేశాడు. అటాక్ జరిగిన క్షణాల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ఏసీపీ ప్రకాశ్ రాయ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.