ముంబై: ఆహారం తిన్న 90 మంది రైలు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. (Train Passengers Fall Sick ) ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. స్టేషన్కు చేరుకున్న రైలు వద్దకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని రప్పించారు. అస్వస్థతకు గురైన ప్రయాణికులకు చికిత్స అందించారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన జరిగింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న భారత్ గౌరవ్ రైలులో సుమారు వెయ్యి మంది ప్రయాణించారు. అయితే మంగళవారం పూణె చేరే ముందు ఆ రైలులో ఆహారం తిన్న సుమారు 90 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల వాంతులు, కడుపులో నొప్పి, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పూణె రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. రైల్వే, స్థానిక డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంటనే రైల్వే స్టేషన్కు రప్పించారు. పూణెకు చేరుకున్న ఆ రైలులో అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వెంటనే వైద్య చికిత్స అందించారు.
మరోవైపు భారత్ గౌరవ్ యాత్ర రైలును ఒక ప్రైవేట్ సంస్థ బుక్ చేసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కలుషిత ఆహారం నమూనాలు సేకరించినట్లు పేర్కొంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పింది. అనంతరం ఆ కంపెనీపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.