Bundelkhand | లక్నో : ఉత్తరప్రదేశ్లోని చిత్రకోట్లో బుందేల్ఖాండ్ గౌరవ్ మహోత్సవ్ వేడుకలను నిన్న రాత్రి నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వాహకులు పటాకులు పేల్చారు. దీంతో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందని అడిషనల్ డీజీపీ భాస్కర్ చెప్పారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. నలుగురు చిన్నారుల పోస్టుమార్టం పూర్తి కాలేదు. ఈ ఘటనలో మరింత మందిని విచారించి, ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.
ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ డీజీ ర్యాంకు ఆఫీసర్తో విచారణ చేయించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ప్రకటించారు.