Karnataka | కర్ణాటకలో జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారని ఆ రాష్ట్ర హోంమంత్రి అరాగ జ్ఞానేంద్ర చెప్పారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను నిందితులుగా అనుమానిస్తున్నట్లు సోమవారం మీడియాకు తెలిపారు. ఆ ఐదుగురిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారని, విచారణ తర్వాత హత్యపై అసలు కారణాలు తెలుస్తాయన్నారు. భజరంగ్దళ్ కార్యకర్త హత్య తర్వాత శివమొగ్గలో చెలరేగిన అల్లర్లను అదుపులోకి తేవడానికి భారీగా పోలీసులను మోహరించామన్నారు. స్థానికంగా 1200 మంది పోలీసులతోపాటు బెంగళూరు నుంచి 200 మందిని తరలించామని అరాగ జ్ఞానేంద్ర తెలిపారు.
ప్రస్తుతం శివమొగ్గలో పరిస్థితిని అదనపు డీజీపీ మురుగన్ పర్యవేక్షిస్తున్నారని అరాగ జ్ఞానేంద్ర చెప్పారు. త్వరలోనే శాంతి భద్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని తెలిపారు. శివమొగ్గలో భజరంగ్దళ్ కార్యకర్త హర్ష (23) హర్షను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. రాష్ట్రంలో హిజాబ్ వివాదం నడుస్తున్న వేళ జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.