పాట్నా: ఏసీ ఫస్ట్ క్లాస్ రైలుబోగీలో సుమారు 75 లీటర్ల విదేశీ మద్యం(Foreign Liquor)తో ప్రయాణిస్తున్న 25 ఏళ్ల నేహా జాను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్లోని సమస్తిపుర్ జంక్షన్లో ఆమెను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు వీడియో తీశారు. కానీ ఒక్క క్షణం కూడా ఆమె తడబడినట్లు కనిపించలేదు. చాలా కూల్గా ఆమె పోలీసులకు సమాధానం ఇచ్చింది. చాలా స్పష్టంగా ఆంగ్లభాషలో ఆమె మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. కంపార్ట్మెంట్లో సెర్చ్ చేస్తున్నా.. ఆమె మాత్రం తన మొబైల్ను చూసుకుంటూ ఉండిపోయింది.
ఢిల్లీ నుంచి బీహార్ వరకు హెచ్-1 ఫస్ట్ ఏసీ కోచ్లో నేహా ప్రయాణించింది. బంధువు ఇషాన్ కుమార్ పేరిట బర్త్ను బుక్ చేశారు. టికెట్ లేకుండా నేహా ట్రావెల్ చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. సమస్తిపుర్ జంక్షన్లో రైలు ఆగినప్పుడు.. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ఆమె కంపార్ట్మెంట్లోకి వెళ్లారు. డోర్ను లోపలి నుంచి లాక్ చేసినట్లు గమనించారు. కాసేపటి తర్వాత నేహా లాక్ ఓపెన్ చేసింది. సెర్చ్ ఆపరేషన్లో 75 లీటర్ల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 1.5 లక్షలు ఉంటుంది. నేహా, ఇషాన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
దర్బంగాలోని సింఘాయి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న బారీ గ్రామం నేహాది. ఆమెకు నలుగురు అక్కాచెల్లెళ్లు. నేహా అందరికన్నా చిన్నది. దర్బంగలోని కేఎస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే అక్రమంగా విదేశీ మద్యాన్ని ఎక్కడికి పంపిస్తున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేశారు. ఆమె తండ్రి సంజయ్ కుమార్ జా ను రెండేళ్ల క్రితం లిక్కర్ కేసులో అరెస్టు చేశారు. ఆమె అక్క నిషూ జాను గత ఏడాది ఎక్సైజ్ శాఖ పట్టుకున్నది. 21 బాటిళ్ల విదేశీ మద్యాన్ని ఆమె వద్ద నుంచి రికవరీ చేశారు. ఆ కుటుంబంలో ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. ఒకరు ఇంకా స్కూల్లో చదువుకుంటున్నారు. ఒకరు ప్రస్తుతం ముజాఫర్పుర్లోని డీఅడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. నీట్లో ఫెయిల్ కావడం వల్ల అతను డ్రగ్ బానిస అయినట్లు తెలిసింది.
ఇంట్లో పెళ్లి వేడుక జరగనున్నదని, దీని కోసం హర్యానా నుంచి మద్యాన్ని తీసుకొస్తున్నట్లు నేహా చెప్పినట్లు పోలీసు అధికారి బీర్బల్ కుమార్ తెలిపారు. మద్య నిషేధ చట్టం కింద ఇద్దరిపై కేసు బుక్ చేసినట్లు చెప్పారు. నేహా, ఇషాన్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి కాల్ డేటా, వాట్సాప్ చాట్లను పరిశీలిస్తున్నారు. అయితే దర్బంగలో ఉన్న అనేక మంది డాక్టర్లు, వ్యాపారవేత్తల సమాచారం నేహా ఫోన్లో ఉన్నట్లు గుర్తించారు. అక్రమ లిక్కర్ దందాతో ఏమైనా లింకు ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు.
🚨 📍Bihar: A large quantity of liquor was recovered from the AC coach of the Swatantrata Senani Express at Samastipur Junction. 🚆🍾
Another major liquor seizure by authorities. 👮♂️🚨 pic.twitter.com/SIttu2vihn
— Sharma Talks (@network_piyush) September 6, 2026