Supreme Court | న్యూఢిల్లీ: సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం సమక్షంలో రెండు విస్కీ బాటిళ్లను పెట్టడంతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అవాక్కయ్యారు. పెర్నోడ్ రికార్డ్ కంపెనీ, జేకే ఎంటర్ప్రైజెస్ మధ్య జరుగుతున్న ట్రేడ్మార్క్ వివాదంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై దాఖలైన అప్పీలు విచారణ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ అప్పీలును దాఖలు చేసిన పెర్నోడ్ రికార్డ్ కంపెనీ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
‘లండన్ ప్రైడ్’ పేరుతో మద్యాన్ని తయారు చేయకుండా జేకే ఎంటర్ప్రైజెస్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ అప్పీలుపై విచారణ ప్రారంభమైన వెంటనే ముకుల్ రోహత్గి మాట్లాడుతూ, ప్రొడక్ట్స్ను కోర్టులోకి తేవడానికి అనుమతించాలని కోరారు. అనంతరం రెండు విస్కీ బాటిళ్లను ధర్మాసనం సమక్షంలో పెట్టారు. వాటిని చూసిన సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ, ‘మీతోపాటు బాటిల్స్ను తీసుకొచ్చారా?’ అని అడిగారు. రోహత్గి బదులిస్తూ, ఈ రెండు ప్రొడక్ట్స్ మధ్య సారూప్యతలను చూపించవలసి ఉందని చెప్పారు. ట్రేడ్మార్క్ చట్టాల ఉల్లంఘన ఏవిధంగా జరిగిందో వివరించారు. అనంతరం హైకోర్టు తీర్పును నిలిపేస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.