ముంబై: బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు సంబంధించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసు దర్యాప్తు చేస్తున్న ఇద్దరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సస్పెండ్ అయ్యారు. అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎన్సీబీ అధికారులు విశ్వ విజయ్ సింగ్, ఆశిష్ రంజన్ ప్రసాద్లను సస్పెండ్ చేశారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసును విశ్వ విజయ్ సింగ్ దర్యాప్తు చేస్తుండగా, ఆశిష్ రంజన్ ప్రసాద్ ఆయనకు డిప్యూటీగా ఉన్నారు. అయితే వారిద్దరూ ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడ్డారు అన్నది తెలియలేదు. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో వారి పాత్ర వల్లనే సస్పెండ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, క్రూయిజ్ డ్రగ్స్ కేసుతోపాటు, ఎన్సీబీ అధికారులు డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలతో సహా ఐదు కేసులను ఎన్సీబీ సిట్కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ కేసులపై దర్యాప్తు జరుగుతున్నది. ఇందులో భాగంగా విశ్వ విజయ్ సింగ్, ఆశిష్ రంజన్ ప్రసాద్లతోపాటు పలువురు ఎన్సీబీ అధికారుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు.
గత ఏడాది అక్టోబర్ 3న ముంబై-గోవా కోర్డెలియా క్రూయిజ్లో డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో ఎన్సీబీ అధికారులు రైడ్ చేశారు. 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల మెఫెడ్రోన్, 21 గ్రాముల గంజాయి, 22 మాదకద్రవ్యాల మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తోసహా 20 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఆర్యన్ ఖాన్తో సహా 18 మంది అనంతరం బెయిల్పై విడుదలయ్యారు.