ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అందుకే వచ్చే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈయన తర్వాతి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉండబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. 2020లోనే ఈ సినిమా గురించి న్యూస్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్, హారిక హాసిని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ తో పాటు చౌడప్ప నాయుడు అనే మరో టైటిల్ కూడా వినిపిస్తుంది. పాన్ ఇండియన్ సినిమాగా దీన్ని తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. బడ్జెట్ కూడా 100 కోట్లకు పైగానే ఉండబోతుందని తెలుస్తుంది.
తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ఇందులో కమెడియన్ సునీల్ కూడా ప్రతినాయక పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఇన్నాళ్లూ కమెడియన్ గా తన స్నేహితుడికి అవకాశాలు ఇచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు సునీల్ను విలన్ గా నిలబెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ చిత్రంలో పొలిటికల్ లీడర్ గా నటించబోతున్నాడు తారక్. నేటి రాజకీయాలలో ప్రజలు ఎలా బలైపోతున్నారు.. అమాయకమైన ప్రజలతో రాజకీయ నాయకులు ఎలా ఆడుకుంటున్నారు.. వాళ్లను ఎలా మోసం చేస్తున్నారనే విషయాన్ని వ్యంగ్యంగా తన శైలిలో చెప్పబోతున్నాడు మాటల మాంత్రికుడు.
అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ స్నేహితుడి పాత్ర ఒకటి ఉందని.. దానికోసం టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టిని తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్. ప్రస్తుతం జాతిరత్నాలు సినిమాతో రానున్నాడు. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్ లోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ సినిమాలో ఫ్రెండ్ కారెక్టర్ అంటే చిన్న విషయం కాదు. ఇంత భారీ సినిమాలో నటిస్తే కచ్చితంగా నవీన్ పొలిశెట్టికి మరింత పాపులారిటీ రావడం ఖాయం.