స్వాతంత్య్రానికి ముందు రోజుల్లో హైదరాబాద్ దక్కన్లో ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల ఉన్నత విద్య కోసం సంపన్న కుటుంబాల పిల్లలు విదేశాలకు పోయి చదివేది. ఐరోపా దేశాల్లో చదువు కోసం పోయినవాళ్లు అక్కడి సామాజిక, రాజకీయ ప్రభావాలకు లోనయ్యేవారు. ఆనాటి ఐరోపా సమాజంలో ప్రజాస్వామ్యం, సామ్యవాదం, కమ్యూనిజం ప్రభావం ఉండేది. అక్కడ చదివిన వాళ్లు కూడా ఆ భావాలను ఒంటబట్టించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చేవాళ్లు.
హైదరాబాద్ దక్కన్లోనూ అలాంటి పాలనా వ్యవస్థ, ఆధునిక సమాజం, పారిశ్రామిక అభివృద్ధిని కోరుకునేవారు. ఇలాంటి మార్పు సాధించడం కోసం ‘అంజుమన్ ఎ -తరక్కీ హైదరాబాద్’ (హైదరాబాద్ అభివృద్ధి సంఘం) ఏర్పాటైంది. అలి యావర్ఖాన్ (అలి యావర్జంగ్), బాఖర్అలీ మీర్జా దీని వ్యవస్థాపకులు. వీరితోపాటు పద్మజా నాయుడు, ఫజులుర్ రహమాన్, డాక్టర్ లతీఫ్ సయ్యద్, బూర్గుల రామకృష్ణారావు, కిషన్, మీర్అక్బర్అలీఖాన్, మందుముల నరసింగరావు మొదలైనవాళ్లు సభ్యులుగా ఉండేవారు. సంస్థలో మత భేదాలు లేవు. అభివృద్ధికి పాటుపడాలంటే ప్రతి సభ్యుడు తన సంపాదనలో నూటికి అయిదు రూపాయలను సంస్థకు విరాళంగా ఇవ్వాలనే నిబంధన ఉండేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించే ఆలీ యావర్ఖాన్ నెలకు 50 రూపాయలు విరాళంగా ఇచ్చేవాడు. ఫజులుర్ రహమాన్ సిటీ కాలేజీ అర్థశాస్త్ర అధ్యాపకుడు.
ఇలా కనుమరుగు
హైదరాబాద్లో సామ్యవాద భావాలను వ్యాప్తి చేయడం ఆ సంఘం ముఖ్య ఉద్దేశ్యం. చదువుకున్న యువకులను సామ్యవాద భావాలవైపునకు మళ్లించేందుకు మూడేళ్లపాటు కృషి చేశారు. అలీ యావర్ఖాన్ సంవిధాన వ్యవహారాల సలహాదారుగా నియమితులయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జవహర్లాల్ నెహ్రూ పార్టీకి అనుబంధంగా కార్మిక శాఖను ఏర్పాటు చేయపూనుకున్నాడు. అపుడు బాఖర్అలీమీర్జాని కార్మిక శాఖకు కోశాధికారిగా నియమించాడు. వీళ్లు వేరే బాధ్యతల్లో మునిగిపోయే సరికి ‘అంజుమన్ ఎ -తరక్కీ హైదరాబాద్’ అంతర్థానమైపోయింది.