చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం రాష్ట్ర సర్కారు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నది. బడికి వెళ్లాంటే భయం ఉన్న చిన్నారుల్లో దాన్ని తొలిగించి బడికి వచ్చేలా అవసరమైన వసతులు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ కిట్లతో చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్నారు. ఇంగ్లిష్ లెటర్లు, పదాలు, బొమ్మలతో బోధిస్తున్నారు. బడిని ఆక్షరించేలా ఆట వస్తువులతో విజ్ఞానాన్ని అందిస్తున్నారు. దాంతో అంగన్కేంద్రాలు కార్పొరేట్ తరహా ప్లే స్కూళ్లను తలపిస్తున్నాయి.
– మునుగోడు, జనవరి 9
చిన్నారులు ప్రాథమిక విద్యపై ఆసక్తి చూపేలా, ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వం కృషిచేస్తున్నది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రీస్కూల్ కిట్లు అందిస్తున్నది. దాంతో పిల్లలు కేంద్రాలకు అలవాటయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. పెన్సిళ్లు, బలపాలు పట్టుకోవడం, మునివేళ్ల మీద నడువడంతో కేంద్రాల్లో బోధన మొదలు పెడుతున్నారు. వేగంగా పరుగెత్తడం, బంతులు విసరడం, తన్నడం తన పనులు తానే చేసుకునే విధంగా నైపుణ్యం పెరిగేలా చేయూతనిస్తున్నారు. అందరితో స్వేచ్ఛగా మాట్లాడడం, కుటుంబ సభ్యులు గురించి ఇతరులతో చర్చించడం, తప్పొప్పులు తెలుసుకోడం, ఆడుకోవడం, ఉద్వేగానికి వెళ్లకుండా వారిని గుర్తించడం వంటివి చిన్నారులకు బోధిస్తున్నారు. కథలు, సంఘటన రూపంలో చిన్నారులకు చెప్తున్నారు. ఒకటి నుంచి పది అంకెల వరకు లెక్కించడం, కూడడం,తీసివేయడం వంటివి నేర్చుకునేందుకు ప్రీ స్కూల్ కిట్లను ఉపయోగిస్తున్నారు. దాంతో చిన్నారులకు చదువుపై ఆసక్తి పెరుగుతున్నది.