యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 19 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ పాతగుట్ట ఆలయంలో
బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో సోమవారం బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని ప్రారంభించారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించమని వేడుకునే కార్యక్రమం పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం జరిపారు.
పారాయణికులు మూలమంత్ర, భాగవత, రామాయణ, వేదప్రబంధ పారాయణాలను పఠించారు. 33 కోట్ల దేవతలు, పద్నాలుగు లోకాలు, సమస్త ప్రాణికోటి, చరాచర జగత్తు అంతా భగవానుడి కటాక్షంతో శుభాలు పొందాలని స్వస్తివాచన మంత్రాలతో విశ్వక్సేన ఆరాధనతో ప్రార్థించారు. వేద మం త్రాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయం ఆధ్యాత్మికతను సంతకరించుకున్నది. ఆలయాన్ని విశేష పుష్పాలతో అలంకరించారు. అర్చకులు స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ఆలయం ముఖ మండపంలో ప్రత్యేక పీఠంపై అధిష్ఠించి పూజలు చేశారు.
పాతగుట్ట బ్రహ్మోత్సవంలో శ్రీవారికి, ఉత్సవ నిర్వాహకులకు రక్షాబంధనం గావించారు. ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, పారాయణికులకు అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి దీక్షా వస్ర్తాలను అందజేశారు. జగద్రక్షకుడైన పరమాత్రమను మూలవరులకు, ఉత్సవమూర్తులకు ఆగమశాస్ర్తానుసారం రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో కల్యాణ సంబురాలు, స్థల, ద్రవ్య శుద్ధ్యర్థం పూజించిన జలాలతో శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యం చేపట్టారు. అర్చకులు ఆలయ పరిసరాలను శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచామృత కలశాలకు దర్బలతో పూజలు నిర్వహించి పుణ్యజలంగా సంప్రోక్షణ జరిపారు. తిరు వీధుల్లో వేదసూక్త మంత్ర పఠనాలతో తీర్థ ప్రోక్షణ చేశారు.
పాతగుట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం 6 గంటలకు స్వామి వారి ఆలయంలో అంకురారోపణ, మృత్సంగ్రహణం వేడుకలను ఆగమ శాస్త్ర రీతిలో చేపట్టారు. తొలిపూజలో భాగంగా ఆలయ ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూ రి వేంకటాచార్యులు, యాజ్ఞికులు కిరణ్కుమారాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, శ్రీధరాచార్యులు, అధ్యాపకులు నల్లన్థీఘళ్ సీతామనోహరాచార్యులు, పారాయణికులు నర్సింహాచార్యులు, జగన్మోహనాచార్యులు, వేణగోపాలాచార్యులు, వేద పండితులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణం, సాయంత్రం 6 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.