కట్టంగూరు, ఆగస్టు 21 : విద్యార్థులు తరగతి స్థాయికి అనుగుణంగా కనీస అభ్యసన సామర్థ్యాలను తప్పనిసరిగా సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి పి.సుసింధర్రావు అన్నారు. శుక్రవారం కట్టంగూర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 9వ తరగతి గదిని సందర్శించిన డీఈఓ విద్యార్థులతో మాట్లాడి గణితంలోని చతుర్విధ ప్రక్రియలపై వారి సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు ఇప్పటివరకు నేర్చుకున్న అంశాలపై ప్రశ్నలు అడిగి వారి అభ్యసన స్థాయిని తెలుసుకుని మాట్లాడారు.
రానున్న పది రోజుల్లో విద్యార్థులందరూ ధారాళంగా చదవడం, చదివిన విషయాన్ని అర్థం చేసుకుని రాయడం, గణితంలోని చతుర్విధ ప్రక్రియలను సులువుగా చేయగలిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు తరగతి స్థాయికి అనుగుణంగా కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా బోధన అందించాలని, ప్రత్యేక అభ్యసన అభివృద్ధి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. విద్యార్థుల్లో గుణాత్మక విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఆయన వెంట ఎంఈఓ అంబటి అంజయ్య, కేజీబీవీ ప్రత్యేక అధికారి నీలాంబరి పాల్గొన్నారు.