నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు పరిధిలో ఈ సీజన్లో వరి సాగు చాలా వరకు తగ్గింది. యాసంగిలోనూ సరిపడా నీళ్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ క్రమంలో యాసంగి పంటగా వరికి బదులు కందిని సాగు చేస్తే రైతులకు రంది ఉండదని, మంచి లాభాలను పొందవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. కంది పంటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు. కంది సాగు విధానాన్ని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త దొంగరి నరేశ్ వివరించారు.
కంది సాగుకు అనువైన ప్రాంతాలు నీటి వనరులు ఉన్న చోట యాసంగి పంటగా కందిని ఏ ప్రాంతంలోనైనా సాగు చేయవచ్చు. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో ఆరు తడి పంటగా సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.విత్తే సమయం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విత్తనం విత్తుకోవాలి. విత్తన మోతాదు : 8-10 కిలోలు ఒక హెక్టారుకు (75 x 20 సెం.మీ.) లేదా (90 x 20 సెం.మీ.) ఆరు తడి పంటగా నాటుకోవాలి.విత్తన శుద్ధి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరమ్ లేదా కాప్టాన్ను పట్టించి విత్తడానికి ఒక గంట ముందు రైజోబియం కల్చర్ వేయాలి.
కంది పైరును 30 నుంచి 40 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. కలుపు నివారణకు విత్తిన వెంటనే ఒక లీటర్ పెండిమిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20 రోజుల తర్వాత సైతం పిచికారీ చేయాలి. కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఇమిజితాపైర్ 600-750 మి.లీ. మందును 500 లీటర్ల నీటిలో కలిపి హెక్టారుకు పిచికారీ చేయాలి. మొదటి రెండు నెలల వరకు తరచూ గొర్రు లేదా దంతెల ద్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారణతోపాటు తేమను నిలుపుకోవచ్చు.
నీటి వసతి ఉన్న చోట కందిని ఆరుతడి పంటగా సాగు చేసి తగు యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ముందుగా విత్తనాలను ఎంపిక చేసుకున్న తదుపరి వాటిని శుద్ధి చేసి తగు మోతాదులోనే నాటుకోవాలి. అనంతరం కలుపు మొలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువులను అవసరమైన మేరకే వాడాలి. పురుగులు, తెగుళ్లను అరికట్టేందుకు సూచించిన మందులను పిచికారీ చేయాలి. కందిని ఇతర పంటలతో కలిపి మిశ్రమ పంటగా సాగు చేస్తే మంచి ఫలితాలు పొంది ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి
ఎల్ఆర్జీ41, ఎల్ఆర్జీ 52, ఐసీపీఎల్ 332, ఐసీపీఎల్ 85063 (లక్ష్మి), ఐసీపీఎల్ 87119 (ఆశ), డబ్ల్యూఆర్జీ 97, డబ్ల్యూఆర్జీ 255 రకాలు ముఖ్యమైనవి.
నీటి తడులు యాసంగిలో రెండు లేదా మూడు తడులు ఇవ్వాలి. మొగ్గలు రాబోయే ముందు ఒకసారి, కాయలు ఏర్పడే మందు మరోసారి తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాలి.
పచ్చ పురుగు నివారణకు వేపనూనె/ వేప గింజల కషాయం (5%) మరియు జీవన పురుగు మందులైన ఎన్పీవీ (500 మి.లీ.) హెక్టార్కు సాయంకాలం వేళల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
మారుకా ఆకుచుట్టు పురుగు నివారణకు మొదటి దశలో వేప గింజల కషాయం లేదా వేప నూనె పిచికారీ చేస్తే రెక్కల పురుగులు గుడ్లు పెట్టుట నివారించబడుతుంది. పురుగు ఆశించిన వెంటనే లీటరు నీటికి డై క్లోరోవాస్ 1 మి.లీ./ క్లోరో పైరిఫాస్ 2.5 మి.లీ./ క్వినాల్ఫాస్ 2 మి.లీ./ నోవల్యురాన్ 1 మి.లీ./ స్పైనోశాడ్ 0.3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. యాసంగిలో కాయ ఈగ (పాడ్ైప్లె) ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ. చొప్పున గింజ కట్టే సమయంలో ఒకటి, రెండు సార్లు పిచికారీ చేయాలి.
ఎండు తెగులు (ప్యుజేరియం) మాక్రోపొమినా ఎండు తెగులు వంటి వాటిని తట్టుకొను రకాలను సాగు చేయాలి. వీటిని నివారించేందుకు పంట మార్పిడితో జొన్న లాంటి పంటలను సాగు చేయాలి.
యాసంగిలో కందిని ఏకపంటగా, అంతర పంటగానూ సాగు చేయవచ్చు. అంతర పంటగా కందిలో మినుము, పెసర, సోయాచిక్కుడు 1ః3 నిష్పత్తిలో సాగు చేయవచ్చు. పత్తి పంటలోనూ కందిని అంతర పంటగా సాగు చేయవచ్చు.