10 లక్షలమందిని ముంచిన ఇండస్వీవా సంస్థ
నాలుగురాష్ర్టాల్లో జోరుగా కొనసాగిన వ్యాపారం
ముగ్గురు ప్రభుత్వ టీచర్లు సహా 24 మంది అరెస్టు
మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్
శేరిలింగంపల్లి, మార్చి 6: ఇండస్ వీవా పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్న ముఠా పుట్ట పగిలింది. బాధ్యులైన 24మందిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం ఆరేండ్లలో దాదాపు 10 లక్షలకుపైగా ప్రజలను మోసంచేసి రూ.1500 కోట్ల వ్యాపారం నిర్వహించినట్టు గుర్తించారు. శనివారం ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మీడియాకు సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. బెంగుళూరుకు చెందిన అభిలాష్ థామస్ 2014లో ‘ఇండస్వీవా’ పేరుతో ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థను ఏర్పాటుచేశాడు.
అదే ప్రాంతానికి చెందిన ప్రేంకుమార్ను చీఫ్ అపరేటింగ్ అఫీసర్గా నియమించుకొని కార్యకలాపాలు ప్రారంభించాడు. కర్ణాటక, కేరళలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో జోరుగా కార్యకాలపాలు కొనసాగించారు. రూ.12,500 చెల్లించి సభ్యత్వం తీసుకొంటే అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ విలువైన ఆరోగ్య ఉత్పత్తులు అందజేస్తామని నమ్మించారు. మరో ఇద్దరితో సభ్యత్వం చేయించాలని ఆలా అందరూ తలా ఇద్దరినీ చేర్పిస్తే లక్షల్లో కమిషన్, బోనస్ వస్తాయని ఊదరగొట్టారు. సంస్థ కార్యకలాపాలపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ బాధితుడు గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో సైబరాబాద్ పోలీసులు సంస్థ సీఈవో అభిలాష్ థామస్, చీఫ్ అపరేటింగ్ అధికారి ప్రేంకుమార్సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారని సీపీ సజ్జనార్ తెలిపారు.
సంస్థ సీఈవో అభిలాష్ థామస్, సీవోవో ప్రేంకుమార్, మండలనేన్ సుబ్రహ్మణ్యన్, ఇమాదుల్లా షరీఫ్, సీకే సుజీద్, రంగనాథన్, యాదాద్రికి చెందిన ములుగు వెంకటేశ్, నాగదేవి, బోగా సుర్యనారాయణ, మిర్యాలగూడకు చెందిన మన్నెపు హరిప్రసాద్, రేణుక, కోదాడకు చెందిన ఉపేందర్, సౌజన్య, నూర్ మహ్మద్ (హైదరాబాద్), మల్లె రంగారెడ్డి (సరూర్నగర్), కొండ శ్రీనివాసులు (కోకాపేట్), నామిరెడ్డి అశోక్రెడ్డి (నాగోల్), కేసీఎస్ శర్మ (హయత్నగర్), శ్రీనివాస్రెడ్డి (ఎల్బీనగర్), ఖమ్మంకు చెందిన కాసాని కేశవరావు, నాగలక్ష్మీ, రామకృష్ణ (విజయవాడ), పవన్కుమార్ (ప్రకాశం), బాలసారథి(నెల్లూరు).