అశోక వర్సిటీకి 150 మంది విద్యావేత్తల బహిరంగలేఖ
న్యూఢిల్లీ, మార్చి 20: రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అశోక యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ప్రతాప్ భాను మెహతా వైదొలగడం దుమారం రేపుతున్నది. దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన 150 మందికిపైగా విద్యావేత్తలు వర్సిటీ ట్రస్టీలకు శనివారం బహిరంగ లేఖ రాశారు. నరేంద్రమోదీ సర్కార్ను విమర్శిస్తున్నందువల్లే మెహతాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆయనకు మద్దతుగా నిలువాల్సిన వర్సిటీ యాజమాన్యం..బలవంతంగా రాజీనామా చేయించిందని ధ్వజమెత్తారు. లేఖ రాసిన వారిలో ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, ప్రిన్స్టన్, కేంబ్రిడ్జ్, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా తదితర వర్సిటీల ఫ్రొఫెసర్లు ఉన్నారు.