హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కరోనా మొదటి, రెండో వేవ్లను ఎదుర్కోవడంలో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సర్కారు.. ఇప్పుడు మూడో వేవ్ను సమర్థంగా అడ్డుకొనేందుకు సిద్ధమైంది. గత అనుభవాలు, సవాళ్లను పరిగణనలోకి తీసుకొని మూడో వేవ్ ఎప్పుడొచ్చినా ప్రమాదం బారిన పడకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. సెకండ్ వేవ్లో మొత్తంగా 55,442 పడకలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రత్యేకంగా పిల్లల కోసం 20 వేల పడకలు సిద్ధంచేసింది. థర్డ్ వేవ్లో ఎక్కువగా చిన్నారులే ప్రభావితమవుతారని పలు అధ్యయనాలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. మొత్తం జనాభాలో 25 శాతం 18 ఏండ్ల లోపువారు ఉండగా, వీరికి కోసం 20 వేల పడకలు ఏర్పాటుచేసింది. ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో 10 వేలు, ప్రైవేటులో 10 వేల పడకలు ఉన్నాయి. రూ.133.9 కోట్లతో ప్రత్యేకంగా పీడియాట్రిక్ బడ్జెట్ను ఏర్పాటుచేసింది. ఇందులో పరికరాలకు రూ.122.34 కోట్లు, సర్జికల్, ఇతర వినియోగ వస్తువులకు రూ.3.67 కోట్లు, మందులకు రూ.788 కోట్లు కేటాయించింది. కరోనా రెండో వేవ్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వేధించింది. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ప్రతి పడకకు ఆక్సిజన్ సౌకర్యం ఉండాలనే లక్ష్యంతో లైన్లను ఏర్పాటుచేసే చర్యలు మొదలు పెట్టింది. మొన్నటివరకు రాష్ట్రంలో 10,466 పడకలకు మాత్రమే ఆక్సిజన్ సరఫరా ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 27,966కు పెంచింది. ఈ పనులు దాదాపు పూర్తి కాగా, ఒకటి రెండు వారాల్లో మొత్తం పడకలకు ఆక్సిజన్ సరఫరా పూర్తి కానున్నది. రూ.103 కోట్లతో 132 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటుచేసింది. 1,000 ఎల్పీఎంలు 51, 500 ఎల్పీఎంలు 61, 250 ఎల్పీఎంలు 20 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైంది.
సెకండ్ వేవ్ సమయంలోనే అనేక చర్యలు
మొదటి వేవ్లో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు అనేక చర్యలు చేపట్టింది. అప్పటివరకు కరోనాకు చికిత్స అందించేందుకు 236 దవాఖానలు మాత్రమే ఉండగా, వాటి సంఖ్యను 1,267కు పెంచింది. 18,232 ఉన్న పడకలను 53,782కు పెంచింది. ఇందులో అప్పటివరకు కేవలం 9 వేలుగా ఉన్న ఆక్సిజన్ బెడ్స్ను 20,985కు, ఐసీయూలు బెడ్స్ 3,264 నుంచి 11,440కి పెంచింది. సాధారణ పడకల సంఖ్య 5 వేల నుంచి 21 వేలకు పెరిగింది. కరోనా నిర్ధారణకు గోల్డెన్ టెస్ట్గా భావించే ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచేందుకు మొత్తం 31 ల్యాబ్లను ఏర్పాటుచేసింది.