మెదక్, ఫిబ్రవరి 10 : పిల్లల రక్షణకు ఎన్నో చట్టాలున్నాయని, ఏమైనా ఆపద వస్తే వెంటనే 1098, 181, 100 నంబర్లకు ఫోన్ చేసే విధంగా పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో బాల, బాలికల అక్ర మ రవాణాలో గుర్తించిన బాధితులకు పునరావాసం కల్పించడానికి తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 18 ఏండ్లలోపు బాల, బాలికలను హింసించడం, లైంగిక వేధింపులకు గురిచేయడం, అసభ్యంగా ప్రవర్తించడం నేరమన్నారు. జిల్లాలో అక్రమ రవాణా, అట్రాసిటీకి సంబంధించి 60 కేసు లు నమోదు కాగా, కేవలం 20 మంది బాధితులకు మాత్రమే నష్టపరిహారం అందించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా కేసులకు సంబంధించి మూడు రోజుల్లోగా చార్జీషీట్, మెడికల్ రిపోర్ట్ తెప్పించి బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. తూప్రాన్, నర్సాపూర్ వంటి ప్రాం తాల్లో అక్రమ రవాణాకు సంబంధించి ఎన్ని కేసులు బుక్ చేశారో వివరాలు అందించాలని ఆదేశించారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ము స్కాన్లో భాగంగా మెదక్, తూప్రాన్ మండ లాల్లో రెండు బృందాల ద్వారా 212 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. చైల్ట్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో గతేడాది జిల్లాలో 38 బాల్య వివాహాలు, అక్రమ దత్తతను అరిక్టటడంతో పాటు పోక్సో చట్టం కింద 41 కేసులు నమోదు చేసి ఆరుగురికి నష్టపరిహారం అందించామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయరాంనాయక్, డీఈవో రమేశ్కుమార్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, డీఎస్పీ సైదులు, ఐసీడీఎస్ అధికారులు, సీడబ్ల్యూసీ ప్రతినిధులు పాల్గొన్నారు.