కొల్చారం/మెదక్ అర్బన్, జూన్28: ట్రాక్టర్ డ్రైవర్ నిర్ల క్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మండలంలోని రంగంపేట ఎస్సీ హాస్టల్లో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు పాఠశాల నుంచి హాస్టల్కు వెళ్తుండగా ట్రాక్టర్ అతివేగంతో దూసుకొచ్చి విద్యార్థులను ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ పట్టణం గోల్కొం డ వీధికి చెందిన శివాయిపల్లి రాజు,పోచమ్మ దంపతుల ఏకైక కుమారుడు జశ్వంత్(15) రంగంపేట జిల్లా ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ రంగంపేటలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటున్నాడు. మెదక్ పట్టణం నర్సిఖేడ్కు చెందిన శంకర్,లక్ష్మి దంపతుల కుమారుడు రజనీకాంత్ (13) అదే పాఠశాలలో చదువుతున్నాడు. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న మెదక్ పట్టణం గోల్కొండ వీధికి చెందిన రామ్చర ణ్ అదే పాఠశాలలో చదువుతూ అదే హాస్టల్ ఉంటున్నాడు. మంగళవారం ఇద్దరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉన్నారు.
ఇరువురు మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు వచ్చి తిని వెళ్తుండగా రామ్చరణ్ కలిశాడు. ముగ్గురు కలిసి హాస్టల్ వెళ్తున్న క్రమంలో మార్గమధ్య లో వెనుకవైపు నుంచి ట్రాక్టర్ వేగంగా వచ్చి విద్యార్థుల ఢీకొట్టి వారిపై నుంచి వెళ్లగా జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, దవాఖానకు తరలిస్తుండగా మార్గమద్యలో రజనీకాంత్ మృతి చెందాడు. ట్రాక్టర్ పై నుంచి వెళ్లడంతో రామ్చరణ్ రెండుకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రంగంపేటలో విషాధ చాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం పోసానిపల్లి గ్రామానికి చెందింది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కాగా ముగ్గురు విద్యార్థులు మెదక్ పట్టణానికి చెందిన వారే కావడం గమనార్హం.
హాస్టల్ వార్డన్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి
రంగంపేటలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థులు ఇష్టారీతిగా రోడ్ల వెంట తిరుగుతున్నారని, కొంతమంది విద్యార్థులు హాస్టల్లోనే ఉండి కూడా పాఠశాలకు రావడం లేదని గ్రామస్తులు తెలిపా రు. హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో పాటు మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని రంగంపేట పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు జశ్వంత్ శవాన్ని దవాఖానకు తరలించకుం డా ఆందోళన చేశారు. మెదక్ రూరల్ సీఐ విజయ్, ఎస్సై శ్రీనివాస్గౌడ్, రూరల్ ఎస్సై సంతోశ్రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ఆందోళన కారులకు నచ్చజెప్పి పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా దవాఖానకు తరలించారు.