సంగారెడ్డి, జూన్ 25(నమస్తే తెలంగాణ) : ఐఐటీ హైదరాబాద్ అకాడమీ ‘బి’ బ్లాక్లోని లాంజ్ ఏరియాలో వేసిన కుర్చీలు ఐఐటీ విద్యార్థులు, బోధన సిబ్బందితో పాటు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లాంజ్ ఏరియాలో వేసిన కుర్చీలు భిన్నమైన ఆకారాల్లో ఉండటమే కాకుండా అందులో కూర్చున్న వెంటనే శరీరం పది నిమిషాల్లో తేలికగా మారుతుంది. తరగతులు ముగిసిన వెంటనే ఈ కుర్చీల్లో సేదతీరేందుకు ఐఐటీ విద్యార్థులు పోటీ పడుతున్నారు. మాస్టర్స్ ఇన్ డిజైన్ కోర్సు చేస్తున్న ఆకాంక్ష సింగ్ కుర్చీలను డిజైన్ చేశారు. వీటికి స్పిండిల్ చైర్స్గా నామకరణం చేశారు. అకాంక్ష సింగ్ సహ విద్యార్థి వివేక్తో కలిసి ఐఐటీలోనే స్పిండిల్ చైర్లను ‘పైన్ ఉండ్’తో తయారు చేశారు.
అతి తక్కువ ఖర్చుతో తయారైన వీటిని ముందుగా ఐఐటీ అకాడమీ బీ బ్లాక్లో వేశారు. ఈ కుర్చీలో కూర్చున్న వారికి పది నిమిషాల్లో అలసట పోతుందని ఆకాంక్ష సింగ్ తెలిపారు. శరీరంలోని కండరాలు రిలాక్స్ కావడంతో పాటు ఆక్యుప్రెషర్ ద్వారా ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఐఐటీ విద్యార్థులు చదువుకోవడం, పరిశోధనలు చేయడంతో అలసట, ఒత్తిడికి గురవుతారన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేకంగా సిండిల్ చైర్లను వేర్వేరు డిజైన్లలో రూపొందించినట్లు తెలిపారు. ఈ స్పిండిల్ చైర్లను ఎయిర్పోర్టు లాంజ్లు, స్పా కేంద్రాలు, ఫిజియోథెరపీ కేంద్రాల్లో వాడవచ్చని ఆకాంక్ష సింగ్ తెలిపారు.