క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులకు సౌకర్యాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేలా ఊరికో ఆటస్థలాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు నందన వనాలుగా రూపుదిద్దుకున్నాయి.ఇక క్రీడాప్రాంగణాల ఏర్పాటుతో పల్లెల్లో క్రీడల సందడి నెలకొననున్నది. అన్ని సౌకర్యాలతో సుమారు ఎకరా స్థలంలో నిర్మించనున్న క్రీడా మైదానాల కోసం అధికారులు స్థలాలను గుర్తిస్తున్నారు. ఎకరా స్థలం లేని గ్రామాల్లో కనీసం అర ఎకరంలోనైనా వీటిని ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం రోజు జూన్ 2న కొన్నిచోట్ల వీటిని ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆట స్థలాలకు చుట్టూరా నీడనిచ్చే మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. వాటి సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు.
ఆరోగ్యం.. మానసికోల్లాసం.. శారీరక ధారుడ్యానికి క్రీడలు ఎంతగానో దోహద పడతాయి. ఆరోగ్యవంతులైన పౌరులను తయారు చేయాలంటే క్రీడలు ఎంతో అవసరం. క్రీడల కోసం గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలు లేవు. మైదానాలు లేక ఎన్నో క్రీడలు మరుగున పడిపోతున్నాయి. యువతలో క్రీడానైపుణ్యం, క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ మైదానాలు లేక ముందడుగు వేయలేక పోతున్నారు. గత ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై దృష్టిసారించలేదు. గ్రామీణ క్రీడాకారుల కోసం ప్రతి పల్లెకు ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగా పల్లెల్లో ‘తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం పేరిట’ మైదానాలు ఏర్పాటు చేయడానికి ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా కసరత్తు జరుగుతున్నది. క్రీడా మైదానాల ఏర్పాటుతో ఆటలు ఆడుకోవచ్చు. ఎంతోమంది క్రీడాకారులు మండల, జిల్లా , రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు, మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి క్రీడా మైదానాల ఏర్పాటు గురించి చర్చింది దిశానిర్దేశం చేశారు. క్రీడా మైదానాల కోసం ఆయా మండలాల్లో తహసీల్దార్లు స్థలాలను గుర్తిస్తున్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో ఎకరం నుంచి ఎకరంన్నర వరకు స్థలం ఉండేలా చూస్తున్నారు. గ్రామానికి ఆనుకొని ఉండే విధంగా స్థల సేకరణ చేస్తున్నారు. స్థల సేకరణ చేసిన పల్లెల్లో భూమిని చదును చేసి, మట్టి పోయడం, క్రీడా సామగ్రి తెప్పించడం తదితర పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ రోజున మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాంగణం…
యువతకు క్రీడలపై ఆసక్తి పెంచడమే కాకుండా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి, తెలంగాణను నంబర్వన్ క్రీడా రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. 2022-23 సంవత్సరంలో ప్రతి ఆవాసంలో ఒక ఎకరా స్థలంలో ‘తెలంగాణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయనున్నారు.ఈ మేరకు ఏర్పాటు చేసే పనిలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఎంపిక చేసిన స్థలం గ్రామం లోపల లేదా గ్రామానికి అనుకుని ఉండి గ్రామస్తులందరికీ సౌలభ్యంగా ఉండాలి. స్థలం చదును, కోర్టుల ఏర్పాటు అనంతరం క్రీడాప్రాంగణాల చుట్టూ నీడనిచ్చే మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. వేప, గుల్మార్, కానుగ, చింతతోపాటు పలురకాల నీడనిచ్చే మొక్కలను నాటనున్నారు. ఇలా సుందరంగా తీర్చిదిద్దిన క్రీడా ప్రాంగణాలను రాష్ట్ర ఆవిర్భావం రోజు జూన్ 2న ప్రారంభించేలా ఏర్పాట్ల చేస్తున్నారు. క్రీడాప్రాంగణాలు ఏర్పాటు, పర్యవేక్షణ కోసం మండలానికో ప్రత్యేకాధికారిని నియమించారు. జనాదరణ పొందిన క్రీడలు కోసం మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. లాంగ్జంప్ పిట్ లేదా ఎక్సర్సైజ్ బార్ – సింగిల్, డబుల్, వ్యాయామానికి సౌక ర్యాలు కల్పించాలి. పవేశ ద్వారం నేమ్ బోర్డుతో ఒక ప్ర వేశ ద్వారం ఏర్పాటు చేస్తారు. అలాగే మండలా నికి రెండు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు (టీకేపీ) జూన్ 2022 నాటికి పూర్తి చేయాలి.