నర్సాపూర్,మార్చి15: దేశంలో నిరంకుశ పరిపాలన చేస్తూ కార్మికులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులను గురి చేస్తున్న కేంద్రప్రభుత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఐటీయూ కార్యదర్శి మల్లికార్జున్ పిలుపునిచ్చారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని ఏర్పాటు చేసిన మండల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభు త్వ వైఖరి సరైనది కాదని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ దేశంలో ఉన్న నల్ల ధనాన్ని బయటకు తీసి ప్రతి కుటుంబానికి రూ. 15లక్షలు ఇస్తానన్న మాట నీటి మీద రాతలుగా మారాయని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, వివిధ రంగాల నాయకులు పెంటయ్య, శుకుర్, రాజు, రాములు, లింగం, లక్ష్మీనారాయణ, పుష్ప, అన్నపూర్ణ, దాసు, కార్మికులు పాల్గొన్నారు.